గాజా: పాలస్తీనాలో జరిగిన యుద్ధ నేరాలపై దర్యాప్తును ఆపేయాలన్న ఇజ్రాయెల్ పిటిషన్ను… అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తిరస్కరించింది. గత రెండేళ్లుగా గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ నేరాలను దర్యాప్తు చేయడానికి ICC ప్రాసిక్యూటర్ను అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని రద్దు చేయడానికి ICCలోని న్యాయమూర్తులు నిరాకరించారు.
దీంతో కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధ నేరాలపై దర్యాప్తును కొనసాగించడానికి ICCకి వీలు కల్పిస్తుంది. 2024 నవంబర్లో ICC… ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు… మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్పై యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కాగా, ఇజ్రాయెల్ ICC అధికార పరిధిని గుర్తించదు. దర్యాప్తును నిరోధించడానికి ప్రయత్నిస్తోంది. అదేసమయంలో హమాస్ నాయకుడు ఇబ్రహీం అల్-మస్రీకి ICC అరెస్ట్ వారెంట్ను కూడా జారీ చేసింది. కానీ అతని మరణం తర్వాత దానిని ఉపసంహరించుకుంది.
2023 అక్టోబర్ 7 తర్వాత జరిగిన సంఘటనలను దర్యాప్తు చేయడానికి ముందు ICC ప్రాసిక్యూటర్ ఇజ్రాయెల్కు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే దానిపై అప్పీల్ దృష్టి సారించింది. అక్టోబర్ 7న గాజాపై జరిగిన దాడులు కొత్త పరిస్థితిని ఏర్పరిచాయని, దక్షిణాఫ్రికా, చిలీ, మెక్సికోతో సహా ఏడు దేశాలు నవంబర్ 2023 నుండి కోర్టుకు సమర్పించిన అదనపు రిఫరల్స్ ద్వారా ఇది సంభవించిందని ఇజ్రాయెల్ వాదించింది.
2021లో ఆక్రమిత పాలస్తీనాలో జరిగిన నేరాలపై ICC అధికారికంగా దర్యాప్తు ప్రారంభించినప్పుడు జారీ చేసిన అసలు నోటిఫికేషన్, తరువాత జరిగిన సంఘటనలను ఇప్పటికే కవర్ చేసిందని పేర్కొంటూ న్యాయమూర్తులు ఈ వాదనను తిరస్కరించారు.
కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని, అంటే నెతన్యాహు,గాలెంట్పై అరెస్టు వారెంట్లు చెల్లుబాటులో ఉన్నాయని వారు చెప్పారు. అక్టోబర్ 10, 2025న హమాస్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తూనే ఉన్న సమయంలో ఈ తీర్పు వచ్చింది.
యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుండి, ఇజ్రాయెల్ ఒప్పందాన్ని 391 సార్లు ఉల్లంఘించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 1,063 మంది గాయపడ్డారు. 632 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, 2023 అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ జరిపిన మారణకాండలో కనీసం 70,663 మంది పాలస్తీనియన్లు మరణించారు. 171,139 మంది గాయపడ్డారు.


