హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ఫెయిర్కు వేళయింది. ఈ పుస్తక ప్రదర్శన నేటినుంచి ఈనెల 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. మద్యాహ్నం ఒంటిగంటనుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది. ఈ ఏడాది ప్రదర్శనను పుస్తకాల స్ఫూర్తిని చాటిచెప్పేలా, పిల్లల కోసం పండుగ వాతావరణాన్ని సృష్టించేలా ప్రణాళిక వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్ఫెయిర్లో మొత్తం 365 స్టాళ్లు, పఠనం ప్రాముఖ్యతను బలోపేతం చేసే లక్ష్యంతో అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
పుస్తకాల కొనుగోలు, అమ్మకాలకు అతీతంగా ఈ ప్రదర్శన ఉంటుందని, సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వామ్యం చేసి, పఠనాన్ని ఒక సాంస్కృతిక ఆచారంగా ప్రోత్సహించడానికి ప్రత్యేక సమావేశాలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అలాగే పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చలు కూడా ఈ 11 రోజుల పాటు చోటు చేసుకోనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొననున్నా యి. శుక్రవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 38వ బుక్ఫెయిర్ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ సుదర్శన్రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.
గతంలో మాదిరిగానే, సాహిత్యం, సంస్కృతికి గణనీయమైన సేవ చేసిన ప్రముఖుల పేర్లను పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి, వేదికలకు సొసైటీ పెట్టింది. మొత్తం ప్రాంగణానికి ప్రజా కవి అందెశ్రీ ప్రాంగణం అని పేరు పెట్టారు. ప్రధాన వేదికకు సృజనాత్మక కళాకారిణి అనిశెట్టి రజిత పేరు పెట్టగా, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్ గౌడ్ పేరు పెట్టారు. రచయితల వేదికకు ప్రొఫెసర్ ఎస్. వి. రామారావు పేరు, మీడియా పాయింట్కు ఇటీవల మరణించిన జర్నలిస్ట్ స్వేచ్ఛ పేరు పెట్టారు.


