హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించింది. యాదాద్రిలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని వేల కోట్లు వెచ్చించి పునర్నిర్మించారు. పునరుద్ధరణ ప్రణాళికలో పురావస్తు అద్భుతం మక్కా మసీదు కూడా చేర్చారు. అయితే పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి.
మక్కా మసీదు పునరుద్ధరణ పనులు 8 ఏళ్లయినా ఇంకా పూర్తికాలేదు. రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను రూ. 1800 కోట్లు వెచ్చించి శరవేగంగా పూర్తిచేసింది. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. 2016లో ప్రారంభించిన ఆలయ నిర్మాణ పనులను 2022 నాటికి పూర్తి చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం 14 ఎకరాల స్థలంలో యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణ పర్యవేక్షణకు ఒక ఐఏఎస్ అధికారిని అప్పగించింది.
అయితే హైదరాబాద్లోని చారిత్రక మక్కామసీదు పునరుద్ధరణ, నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
పునరుద్ధరణ పనులు పూర్తి చేయడంపై అటు ప్రభుత్వానికి గానీ, ఇటు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులకు గానీ ఆసక్తి లేదు. తెలంగాణ ప్రభుత్వం ముస్లింలను లేదా ముస్లిం ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా వారి ప్రార్థనా స్థలాలను కూడా దారుణంగా నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.