హైదరాబాద్: ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరంతో దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్-హైదరాబాద్), ఉత్తర డిస్కమ్ (టీజీఎన్పీడీసీఎల్-వరంగల్) చితికిపోతున్నాయని, వాటి పరపతి పెంచడానికి వీలుగా ప్రభుత్వం కొత్త డిస్కమ్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పాటైన మూడో డిస్కం తన కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి రోజు నుంచే పెద్ద ఆర్థిక సవాళ్లను ఎదుర్కోబోతోంది. ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థల రూ. 35,900 కోట్ల పెండింగ్ విద్యుత్ బకాయిలను కొత్త విద్యుత్ సంస్థకు బదిలీ చేసి, ఈ బకాయిలను మూడు ప్రభుత్వ సంస్థల నుండి వసూలు చేయాలని సూచించాయి.
కాగా, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఒక్కటే ఏకంగా రూ. 22,900 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఆ తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) (రూ. 7,084 కోట్లు), మిషన్ భగీరథ (రూ. 5,972 కోట్లు) ఉన్నాయి. మొత్తం విద్యుత్ బకాయిలు రూ. 45,398 కోట్లుగా అంచనా వేయగా, అందులో రూ. 35,900 కోట్లను కొత్త డిస్కంకు బదిలీ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభం కాకముందే మూడో విద్యుత్ సంస్థపై ఆర్థిక భారం మోపడం వల్ల అది ముందుకు సాగడానికి చాలా ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు.
“విద్యుత్ సంస్థలకు దేశంలోని షెడ్యూల్డ్ బ్యాంకులతో సహా వివిధ ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉంది. మంచి ఆర్థిక స్థితిని కొనసాగించే సంస్థలు ఇంధన మౌలిక సదుపాయాల మెరుగుదల,ఇతర అభివృద్ధి పనుల కోసం రుణాలు తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటాయి” అని అధికారులు తెలిపారు. కొత్త డిస్కం తన ఆర్థిక బ్యాలెన్స్ షీట్ను అప్పులు,పెండింగ్ విద్యుత్ బకాయిలతో ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్తులో ఆ సంస్థ మనుగడపై తీవ్రమైన ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉందని వారు అన్నారు.
తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్), తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్)పై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, ఎటువంటి ఆర్థిక సహాయం అందించకుండానే అన్ని విద్యుత్ బకాయిలను మూడో డిస్కంకు బదిలీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇప్పటికే ఉన్న డిస్కంలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉచిత, రాయితీ విద్యుత్ సరఫరా పథకాలన్నింటినీ కూడా కొత్త డిస్కం పరిధిలోకి తీసుకువచ్చారు.
“ఇలాంటి నిర్ణయాలు మొదట్లో బాగానే కనిపిస్తాయి. కానీ కొత్త డిస్కం భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తే మొత్తం విద్యుత్ రంగం తీవ్ర ప్రమాదంలో పడుతుంది” అని వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, కనీసం ఒక సంవత్సరం పాటు మూడు విద్యుత్ సంస్థల పనితీరును అధ్యయనం చేసిన తర్వాతే, కొత్త డిస్కామ్ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఇంధన శాఖ అధికారులు తెలిపారు.


