హైదరాబాద్: రాజధాని నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి, డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ప్రణాళికలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు జీహెచ్ఎంసీలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో మాట్లాడుతూ…నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూఆర్ఈ) ప్రాంతంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనికోసం రాబోయే ఐదేళ్ల కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
హైదరాబాద్లో వ్యర్థాల నిర్వహణ ఒక సంక్లిష్ట సమస్య అని పేర్కొంటూ…తమ తమ జోన్లలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని ఆయన అన్నారు. ప్రతి 10 రోజులకోసారి చెత్త తొలగింపు కార్యక్రమంతో పాటు, నెలకు మూడు రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంతేకాదు రోడ్లపై గుంతలు, చెత్త లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
“హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించాం. చెరువులు, డ్రైనేజీలను ఆక్రమణల నుండి రక్షించాలి. అలాగే, క్యూఆర్ఈ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వాహనాలను తీసుకురావాలని కూడా నిర్ణయించాం,” అని ఆ ప్రకటనలో ఆయన చెప్పినట్లు పేర్కొంది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా), జీహెచ్ఎంసీ, నగర జలమండలి జనవరిలో డ్రైనేజీ వ్యవస్థల్లో పూడికతీత పనులు చేపట్టాలని రెడ్డి ఆదేశించారు. దోమల బెడదను, అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి జోనల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నారు.
ఈ నెల ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం మాట్లాడుతూ…సేవలు, తయారీ రంగం, వ్యవసాయం కోసం తెలంగాణను మూడు స్పష్టమైన జోన్లుగా విభజించిన భారతదేశంలోనే మొదటి మరి, ఏకైక రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ వ్యూహమని ముఖ్యమంత్రి చెప్పారు.
“మేము దీనిని క్యూఆర్ఈ, ప్యూఆర్ఈ, ఆర్ఏఆర్ఈ మోడల్ అని పిలుస్తాము. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (దీనిని క్యూఆర్ఈ అంటారు), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (దీనిని ప్యూఆర్ఈ అంటారు), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (దీనిని ఆర్ఏఆర్ఈ అంటారు),” అని ఆయన అప్పట్లో అన్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని నిర్ధారించే లక్ష్యంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 27 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి, జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుండి 300కి పెంచింది.
అంతేకాదు మొన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అనే మూడు పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ అనే నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు.


