హైదరాబాద్: దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిన్న సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్లో 50వేల మంది గిగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్డులకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు.
మెరుగైన వేతనాలు, పని పరిస్థితులు కల్పించాలని, ప్రమాదాలు, ఒత్తిడికి కారణమవుతున్న 10 నిమిషాల డెలివరీ రద్దు చేయాలని, పాత పే-అవుట్ సిస్టమ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. దీంతో కొత్త సంవత్సరం వేళ డెలివరీ సేవలకు అంతరాయం కలిగింది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఈ సమ్మెను చేపట్టింది.
హైదరాబాద్లోని మొత్తం రెండు లక్షల మంది గిగ్ కార్మికులలో దాదాపు 50,000 మంది పాల్గొన్నారని టిజిపిడబ్ల్యుయు అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిమాండ్ రాత్రి సమయంలో గరిష్టంగా ఉన్నప్పటికీ రాత్రి 8 గంటల వరకు దాదాపు 50,000 మంది సమ్మెలో పాల్గొన్నారని ఆయన అన్నారు. బుధవారం భోజన సమయంలో సమ్మె ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు.
ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్లు పోలీసులు, బౌన్సర్ల సహాయం తీసుకోవడం ద్వారా సమ్మెను విఫలం చేయడానికి ప్రయత్నించాయని తెలంగాణ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. సమ్మెలో పాల్గొనని కొంతమంది ఫుడ్ డెలివరీ కార్మికులు తమకు ప్రోత్సాహకాలు చెల్లించారని చెప్పారు.
కార్మికుల గౌరవం, సామాజిక భద్రతను నిర్ధారించడం, కార్మికుల ఐడిలను బ్లాక్ చేయడానికి తగిన ప్రక్రియను అనుసరించడం వంటివి యూనియన్ల డిమాండ్లలో ఉన్నాయని, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం చేసుకోవాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.


