హైదరాబాద్: నదీ జలాల కేటాయింపులో కాంగ్రెస్ చేసిన ‘ద్రోహాలపై’ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పీఆర్ఎల్ఐఎస్), కాళేశ్వరం ప్రాజెక్టులను అధికార పార్టీ రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే ఆరోపించారు.
తెలంగాణ భవన్లో “నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై ప్రజెంటేషన్ ఇస్తూ… ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్లో ప్రాజెక్టును చేర్చడంలో విఫలమవడం ద్వారా కాంగ్రెస్ ‘అసలైన ద్రోహానికి’ పాల్పడిందని హరీష్ రావు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సాధించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా సాధించలేకపోయిందని ఆయన అన్నారు. దీనికి బదులుగా, ఈ కాలంలో మూడు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు (డీపీఆర్) వెనక్కి వచ్చాయని తెలిపారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మాట్లాడుతూ…మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొన్ని పిల్లర్లకు జరిగిన నష్టాన్ని రాజకీయం చేయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును నిలిపివేసిందని హరీష్ రావు అన్నారు.
“మరమ్మతుల కోసం నామమాత్రంగా రూ. 100 నుంచి 200 కోట్లు ఖర్చు చేస్తే, దాదాపు 5 నుంచి 6 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయవచ్చు… బ్యారేజీ లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోయవచ్చు, కానీ అలా చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఉత్తర తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేయడానికే ఇష్టపడుతోందని” ఆయన అన్నారు.
‘అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలి’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని కూడా ఆయన ఆరోపించారు. తన అభ్యర్థన మేరకే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేశారన్న ముఖ్యమంత్రి వాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఖండించిందని ఆయన గుర్తుచేశారు.
“2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్టే ఆర్డర్ కారణంగానే పనులు నిలిచిపోయాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది,” అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన చట్టపరమైన విజయానికి క్రెడిట్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారిక రికార్డుల నుండి “సగం పేరాలు , పాక్షిక వాక్యాలను” చదివి, కేసీఆర్ అన్యాయమైన నీటి పంపిణీకి అంగీకరించారని ఒక తప్పుడు కథనాన్ని సృష్టించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్తో అన్యాయమైన 66:34 నీటి పంపిణీ నిష్పత్తికి ప్రభుత్వం అంగీకరించిందని కూడా ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల వినియోగం కేవలం 28.49 శాతానికి పడిపోయి చారిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరిందని ఆయన ఎత్తి చూపారు. తెలంగాణ హక్కులను పరిరక్షించడానికి బిఆర్ఎస్ భారీ ‘జల పోరాటం’ ప్రారంభించాలని యోచిస్తోందని హరీష్ రావు తన ప్రసంగాన్ని ముగిస్తూ చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ బయటపెడుతుందని పునరుద్ఘాటించారు.


