కొత్తగూడెం: సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయిందని, ఆ పార్టీది ముగిసిన అధ్యాయమని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జి వినీత్ పేర్కొన్నారు. పీఎల్జీఏ వారోత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకోవాలన్న నిషేధిత సీపీఐ-మావోయిస్ట్ పార్టీ పిలుపును ఏజెన్సీ ప్రజలు నిరాకరించినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ ఆవిర్భావ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేసినప్పటికీ ప్రజలు వారికి సహకరించలేదని ఎస్పీ అన్నారు.
మావోయిస్టులు ఆదివాసీల అభివృద్ధి నిరోధకులుగా మారి సంఘ విద్రోహక చర్యలతో వారిని పావులుగా వాడుకుంటూ ఛత్తీస్గఢ్ అడవుల్లో తలదాచుకుంటున్నారన్నారు. మావోయిస్టు నాయకులు ఆదివాసీలపై పాల్పడుతున్న దౌర్జన్యాలను గ్రహించిన ప్రజలు ఆ పార్టీకి సహకరించడం లేదన్నారు.
మావోయిస్టు పార్టీ నాయకులు తమ విలాసవంతమైన జీవితాల కోసం కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు అమాయక గిరిజనులను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. మావోయిస్టుల భావజాలం, వారి సిద్ధాంతంపై రెండో క్యాడర్ నాయకులు అసంతృప్తని వ్యక్తపరిచి, పోలీసుల ఎదుట లొంగిపోయామని ఆయన అన్నారు
కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు నాయకులు ప్రజల పట్ల వ్యవరిస్తున్న తీరుతో సొంత పార్టీలోని నాయకులు, సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించేందుకు లొంగుబాట పడుతున్నారని, మావోయిస్టు పార్టీది ముగిసిన అధ్యాయమని ఎస్పీ డాక్టర్ జి వినీత్ పేర్కొన్నారు.