న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ సమీపంలో ఒక మసీదు వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆక్రమణల తొలగింపు డ్రైవ్ హింసాత్మకంగా మారడంతో కనీసం ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన సుమారు 300 మంది అధికారులు, కార్మికులు తుర్క్మన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజ్ ఇలాహీ మసీదు,శ్మశానవాటికకు ఆనుకుని ఉన్న భూమిలో కూల్చివేత డ్రైవ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘర్షణలు చెలరేగాయి.
అయితే, కూల్చివేత డ్రైవ్ సమయంలో, కొందరు స్థానికులు అధికారులపై రాళ్లు రువ్వారు, దీంతో ఐదుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మేము బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. అక్కడ ఒక భోజనశాల, ఒక డిస్పెన్సరీ ఉన్నాయి, వాటిని కూల్చివేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ డ్రైవ్ను రాత్రిపూట నిర్వహించాము,” అని సీనియర్ పోలీసు అధికారి నిధిన్ వల్సన్ అన్నారు.
“రాళ్ల దాడిలో పాల్గొన్న వారిపై మేము చర్యలు తీసుకుంటాము. ఇక్కడ పరిస్థితి 100 శాతం అదుపులో ఉంది,” అని ఆయన తెలిపారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, గుంపు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు ఉన్న 100కి పైగా వీడియోల సహాయంతో ఇతరులను గుర్తిస్తున్నామని పోలీసులు చెప్పారు. గాయపడిన పోలీసులు, MCD కార్మికుల వాంగ్మూలాల ఆధారంగా ఒక కేసు కూడా నమోదు చేసారు.
కాగా, ఈ ప్రాంతంలోని అనధికార నిర్మాణాలను తొలగించడానికి అధికారులు సుమారు 30 బుల్డోజర్లు, 50 ట్రక్కులను తీసుకువచ్చారు. నవంబర్ 2025లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఆ ఆదేశాలలో తుర్క్మన్ గేట్ సమీపంలోని రామ్ లీలా మైదానంలో 38,940 చదరపు అడుగుల ఆక్రమణలను తొలగించడానికి పౌర సంస్థకు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి మూడు నెలల సమయం ఇచ్చింది.
కాగా, ఆ భూమి వక్ఫ్ చట్టం ద్వారా నిర్వహిస్తున్న ఒక నోటిఫైడ్ వక్ఫ్ ఆస్తి అని, అందువల్ల దానికి సంబంధించిన అన్ని వివాదాలపై వక్ఫ్ ట్రిబ్యునల్కు ప్రత్యేక అధికార పరిధి ఉందని మసీదు సయ్యద్ ఫైజ్ ఎలాహి మేనేజింగ్ కమిటీ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.


