హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ను నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను అహేతుకంగా చేపట్టారని అన్నారు.
“జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణపై మాకు వినతులు వస్తున్నాయి. రాజకీయ కారణాల ఆధారంగా (జిల్లాలపై) నిర్ణయాలు తీసుకుంటే న్యాయం జరగదు. త్వరలో, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో, రెవెన్యూ శాఖలో పనిచేసిన అధికారులు, ఇతరులతో కూడిన ఒక కమిటీని నియమిస్తాము,” అని ఆయన అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ విషయంపై ప్రభుత్వం చర్చ చేపడుతుందని ఆయన అన్నారు.
గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం ఐదు మండలాలను కలిపి కూడా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేసిందని, దీనివల్ల పాలనలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల సౌలభ్యం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరోసారి జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల పేర్లు , పరిధిపై గతంలో జరిగిన కొన్ని మార్పులను ముఖ్యమంత్రి తప్పుబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. పలువురు నాయకులు జిల్లాలు, ఇతర పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణకు డిమాండ్ చేశారు. ప్రతిపాదిత కమిటీ పునర్వ్యవస్థీకరణపై ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.


