టెహ్రాన్: ఇరాన్ పౌరుల హత్యలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని ఇరాన్ ఆరోపించింది. ఇటీవలి నెలల్లో వేలాది మంది ఇరానియన్లు – పిల్లలు, శాస్త్రవేత్తలు, కమాండర్లు, సాధారణ పౌరులు హత్యకు గురయ్యారని, ఇది తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద కుట్రలో భాగమన్నారు. ఈమేరకు హింసాత్మక నిరసనలలో జోక్యం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికపై ఒక సీనియర్ ఇరాన్ అధికారి స్పందించారు.
ప్రభుత్వ సంస్థలను “స్వాధీనం చేసుకోమని” ఇరానీయులను కోరుతూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేస్తున్న మాజీ పార్లమెంట్ స్పీకర్ అలీ లారిజానీ, Xలో ఇలా పోస్ట్ చేశారు: “ఇరాన్ ప్రజల ప్రధాన హంతకులు ట్రంప్, నెతన్యాహులేనని పోస్ట్ చేశారు.”
దేశ నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని ఇరానీయులను ట్రంప్ కోరిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది, వారికి “సహాయం వస్తోంది” అని చెప్పారు. గురువారం నుండి దేశవ్యాప్తంగా జరిగిన భారీ నిరసనల తర్వాత ఇరాన్ అధికారులు దేశంపై తిరిగి నియంత్రణ సాధించామని చెప్పారు. 1979 విప్లవం తర్వాత అధికారంలోకి వచ్చిన నాయకత్వానికి ఈ నిరసనలు అతిపెద్ద సవాల్గా నిలిచాయి.
కాగా, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ వేగంగా పడిపోతున్న నేపథ్యంలో… తీవ్ర ఆంక్షలకు గురైన ఈ దేశం ఇటీవలి వారాల్లో విస్తృత నిరసనలతో అట్టుడికిపోతోంది.
ఇరాన్లోని నిరసనకారులకు “సహాయం వస్తోంది” అని సోషల్ మీడియా పోస్ట్లో తాను చెప్పినదానికి అర్థం ఏమిటని అడిగినప్పుడు, ట్రంప్ మిచిగాన్లో విలేకరులతో మాట్లాడుతూ… వారే దానిని తెలుసుకోవాలని అన్నారు. తరువాత అతను CBS న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను ఉరితీయడం ప్రారంభిస్తే అమెరికా “చాలా బలమైన చర్య” తీసుకుంటుందని చెప్పాడు, కానీ ఆ చర్యలు ఏమిటనే దానిపై వివరాలు వెల్లడించలేదు.
ఇరాన్లో అమెరికా విధాన లక్ష్యం ఏమిటని అడిగినప్పుడు, ట్రంప్ మాట్లాడుతూ… “అంతిమ లక్ష్యం గెలవడమే. నాకు గెలవడం ఇష్టమని ట్రంప్ అన్నారు. 2020లో ఇరాన్ జనరల్ ఖాస్సెమ్ సులేమానీని చంపడం, తాజాగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేయడం వంటి గత సంఘటనల మాదిరిగానే, వేగవంతమైన వ్యూహాత్మక విజయం కోసం చూస్తున్నట్లు ట్రంప్ పరోక్షంగా సూచించారు.
“ఇరాన్లో జరుగుతున్నది మేము చూడాలనుకోవడం లేదు” అని ట్రంప్ అన్నారు. మీకు తెలుసు, వారు నిరసనలు చేయాలనుకుంటే అది వేరే విషయం, కానీ వారు వేలాది మందిని చంపడం ప్రారంభించాక, ఇప్పుడు మీరు ఉరితీయడం గురించి నాకు చెబుతున్నారు – అది వారికి మంచిది కాదు. ఇదిలా ఉండగా, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ వారాంతంలో ఇరాన్ పదవీచ్యుత షా పెద్ద కుమారుడిని కలిశారని యాక్సియోస్ వార్తాసంస్థ నివేదించింది.
కాగా, ఇరాన్లో దేశవ్యాప్త నిరసనలు చెలరేగినప్పటి నుండి రెజా పహ్లావితో జరిగిన ఈ సమావేశం మొదటిది, దీనిని అమెరికా, ఇజ్రాయెల్ ప్రేరేపించాయని టెహ్రాన్ చెబుతోంది. మరోవంక అమెరికా సైనిక చర్యకు సంబంధించిన భయాల మధ్య ఇరాన్, ఖతార్ అధికారులు నిన్న చర్చలు జరిపారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేస్తున్న మాజీ పార్లమెంట్ స్పీకర్ అలీ లారిజానీ, ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీతో ఫోన్లో మాట్లాడారు.
ఈమేరకు ఖతార్ ప్రధాని మాట్లాడుతూ… “ఉద్రిక్తతలను తగ్గించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు, అలాగే ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి శాంతియుత పరిష్కారాలకు ఖతార్ మద్దతును పునరుద్ఘాటించాను” అని అన్నారు.
జూన్లో ఇజ్రాయెల్తో 12 రోజుల యుద్ధం సమయంలో ఖతార్ ఇరుపక్షాల మధ్య చిక్కుకుంది, అప్పుడు ఇరాన్ తన అణు కర్మాగారంపై అమెరికా దాడులకు ప్రతీకారంగా దోహా వెలుపల ఉన్న అల్ ఉదీద్ వైమానిక స్థావరం వద్ద అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుంది.


