హైదరాబాద్: రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోటలో ఉన్న బీసీ ఇంటర్మీడియట్ బాలికల హాస్టల్లో శుక్రవారం రాత్రి, ఫుడ్ పాయిజన్ కారణంగా 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో హాస్టల్ వార్డెన్ విజయ వారిని వెంటనే కొత్తకోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
వైద్య అధికారి డాక్టర్ శ్రావణి వారికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, రాత్రి భోజనంలో విద్యార్థినులు సొరకాయ కూర, టమాటా రసం, గుడ్డు తిన్నారని వార్డెన్ తెలిపారు.
ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, హేమంత్ తదితర పలువురు ప్రజాప్రతినిధులు విద్యార్థినుల పరిస్థితిని తెలుసుకోవడానికి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం రాత్రికి డీఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి హాస్టల్ను సందర్శించి, మిగిలిన విద్యార్థినులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మరోవంక బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, హేమంత్… ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని నిలువరించారు.


