హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ను ‘బ్లాక్మెయిల్ రాజకీయ సమితి’గా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి సంఘటనలు… బీఆర్ఎస్ నాయకత్వం వ్యాపారవేత్తలను డబ్బు కోసం ఎలా బ్లాక్మెయిల్ చేసిందో, భూములను ఎలా కబ్జా చేసిందో నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ములుగులో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గులాబీ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 1500 కోట్లు అనైతిక పద్ధతుల ద్వారా జమ అయ్యాయని ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసినప్పటికీ, కేంద్రం మాత్రం కాలేశ్వరం ప్రాజెక్ట్, ఫార్ములా ఇ రేస్ కుంభకోణాలపై సీబీఐ విచారణకు ఆదేశించలేదని చెబుతూ సీఎం రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధం ఉందని ఆరోపిస్తూ… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పేరును “కిషన్ రావుగా మార్చుకుని, కేసీఆర్ దత్తపుత్రుడిగా మారారు” అని అన్నారు.
“కాలేశ్వరం కుంభకోణంలో సీబీఐ విచారణకు ఆదేశించకుండా కేంద్రాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఫార్ములా ఇ రేస్ కేసులో కిషన్ రెడ్డి కేటీఆర్ను కాపాడుతున్నారా లేదా? కిషన్ రెడ్డి బలమైన బంధాన్ని కొనసాగిస్తూ బీఆర్ఎస్ నాయకులైన కేసీఆర్, కేటీ రామారావు (కేటీఆర్), హరీష్ రావులను రక్షిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసే వరకు మేము కిషన్ రెడ్డిని కిషన్ రావు అనే పిలుస్తామని” ముఖ్యమంత్రి అన్నారు.
కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాను రద్దు చేయడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం గానీ ప్రభుత్వం పరిశీలించడం లేదని ఆయన హామీ ఇచ్చారు.
“జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీ కుట్ర రాజకీయాలకు బలికావద్దు. భూపాలపల్లి జిల్లా యథాతథంగా ఉంటుందని” ముఖ్యమంత్రి అన్నారు.
సింగరేణి కార్మికుల కోసం మెడికల్లీ అన్ఫిట్ బోర్డును తొలగిస్తామని, సింగరేణిలో కారుణ్య నియామకాలు కొనసాగుతాయని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. పని నుండి తొలగించిన 217 మంది కార్మికుల సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. బీఆర్ఎస్,బీజేపీ “ఒకే నాణేనికి రెండు ముఖాలు” అని అన్నారు. కేటీఆర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పట్టణాభివృద్ధికి ఏమీ చేయలేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం… మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కోసం రూ. 17,442 కోట్లు మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు.
“కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల విలువైన టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు,వ్యాపారాలను సంపాదించుకుంది, కానీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లభించలేదు. కేసీఆర్ సంవత్సరానికి 2 లక్షల ఇళ్లు నిర్మించి ఉంటే, పదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించే అవకాశం ఉండేది,” అని రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను అందిస్తోందని ఆయన చెప్పారు.
2027 గోదావరి పుష్కరాల సమయంలో, ప్రభుత్వం బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ప్రాంతాన్ని రూ. 3,000 నుండి 4,000 కోట్లు ఖర్చు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

