ముంబయి: అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి పౌర స్మృతిని (యూసీసీ) రూపొందించాలని, అది విభేదాలకు దారితీయకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జరిగిన సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భాగవత్ మాట్లాడుతూ… ఒప్పందాలలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందని అన్నారు. “అది ఇరుపక్షాలకూ లాభదాయకంగా ఉండాలి… మనం నష్టపోకుండా చూసుకోవాలని అన్నారు.” హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ… సావర్కర్కు ఈ పురస్కారం ఇస్తే దాని ప్రతిష్ట పెరుగుతుందని అన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా, మెజారిటీ లేదా మైనారిటీ (సమాజం) అంటూ ఏమీ లేదని, “మనం అందరం ఒకే సమాజం” అని ఆయన అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్ఎస్ఎస్కు “అచ్ఛే దిన్” (మంచి రోజులు) వచ్చాయా అని అడగ్గా… “మాకు అచ్ఛే దిన్ బీజేపీ వల్ల రాలేదు… దీనికి విరుద్ధంగా జరిగింది. మేము రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాము. మాకు మద్దతు ఇచ్చిన వారు లబ్ధి పొందారని భాగవత్ అన్నారు..”
ఆర్ఎస్ఎస్కు ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) రావడం స్వయంసేవకుల కఠోర శ్రమ, సైద్ధాంతిక విధానాల పట్ల వారి నిబద్ధత వల్లేనని కూడా భాగవత్ అన్నారు. అవసరమైనప్పుడు ఆర్ఎస్ఎస్ సలహాలు ఇస్తుంది. “వారి పాపాలు మాపై పడుతున్నాయి, ఎందుకంటే వారు మా నుండే వచ్చారు,” అని ఆయన అన్నారు, రాజకీయ ఒత్తిడి ఓటర్ల నుండి వస్తుందే తప్ప ఆర్ఎస్ఎస్ నుండి కాదని ఆయన అన్నారు.
వందేళ్లలో కమ్యూనిస్టుల బలం ఎందుకు పెరగలేదని అడగ్గా…ఆర్ఎస్ఎస్ వారికి మార్గదర్శకత్వం ఇవ్వగలదని భగవత్ అన్నారు.
కాగా, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నటీనటులు రవీనా టాండన్, విక్కీ కౌశల్, అనన్య పాండే, చిత్రనిర్మాతలు కరణ్ జోహార్, మధుర్ భండార్కర్, రమేష్ తౌరానీ మరియు సంగీత విద్వాంసుడు పండిట్ హృదయనాథ్ మంగేష్కర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

