Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

మైనారిటీలపై తుపాకీ గురిపెట్టిన అస్సాం సీఎం!

Share It:

గువహటి: బీజేపీ అస్సాం యూనిట్‌ ‘X’ లో ఒక వీడియోను పోస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ వీడియోలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తుపాకీతో గురిపెట్టి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరుపుతున్నట్లు చూపించారు – ఆ ఇద్దరిలో ఒకరు తలకు టోపీ ధరించగా, మరొకరు గడ్డంతో ఉన్నారు. దీనికి- “పాయింట్-బ్లాంక్ షాట్” అనే శీర్షిక పెట్టారు. అయితే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది.

కానీ ఈ వీడియో ముస్లింలపై హింసకు పిలుపునిచ్చింది, వారిని ముఖ్యమంత్రి “బంగ్లాదేశీయులు” అని పదే పదే సంబోధిస్తూ… పౌరులుగా వారి హక్కులను కాలరాస్తున్నాడు.

అస్సాం సీఎం శర్మ ఆర్‌ఎస్‌ఎస్), విహెచ్‌పి, బజరంగ్ దళ్ వంటి హిందుత్వ సమూహాలలో “సభ్యుడు” కాదు. ఆయన ఒక అధికార స్థానంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మాటలను రాష్ట్రంలో శాంతిభద్రతలను అమలు చేసేవారు, వాటిని పాటించాల్సిన వారు సీరియస్‌గా తీసుకుంటారు.

దీనికి ఒక వాస్తవ ఉదాహరణ ఉంది. జనవరి 27న ఒక అధికారిక కార్యక్రమం సందర్భంగా, అస్సాం ముఖ్యమంత్రి “మియాల”ను వేధించడం గురించి అదుపుతప్పి మాట్లాడారు – (“మియా” అనేది బెంగాలీ మాట్లాడే ముస్లింలను కించపరచడానికి ఉపయోగించే పదం) “రిక్షాలో ప్రయాణానికి రూ. 5 అయితే, వారికి రూ. 4 ఇవ్వండి. వారికి ఇబ్బందులు ఎదురైతేనే వారు అస్సాం విడిచి వెళ్తారు…ఇప్పుడు నేనే స్వయంగా ఇబ్బందులు పెట్టమని ప్రజలను ప్రోత్సహిస్తున్నానని” అని శర్మ అన్నారు.

మూడు రోజుల తర్వాత, రాష్ట్రంలో ఒక యువతి ముస్లిం రిక్షా కార్మికుడికి రూ. 20కి బదులుగా కేవలం రూ. 4 మాత్రమే ఇచ్చిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చిన్న సంఘటనలా అనిపించినప్పటికీ, ఇది కేవలం చిన్న విషయం కాదు, ముఖ్యమంత్రి మాటలకు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇది మైనారిటీ రిక్షా కార్మికులకు తక్కువ డబ్బు ఇవ్వడంతో ప్రారంభం కావచ్చు, కానీ శర్మ మైనారిటీలపై తుపాకీ గురిపెట్టి వారే లక్ష్యమని చూపిస్తే, వారు నిజంగానే లక్ష్యాలుగా మారే అవకాశం ఉంది.

అస్సాం బీజేపీ పోస్ట్ చేసిన, మక్తూబ్ మీడియా సరైన రీతిలోనే ఉపయోగించిన ‘జాతి నిర్మూలన’ వీడియోలో హిమంత బిస్వా శర్మ కనిపించడం, ప్రతి పౌరుడిని రక్షించాల్సిన రాజ్యాంగ మూల సూత్రాలనే దెబ్బతీస్తోంది. ఇది జాతీయ సమైక్యత సూత్రాలను అగౌరవపరుస్తుంది, ఒక నిర్దిష్ట వర్గంపై అనుమానాలను రేకెత్తిస్తుంది, శాసనపరమైన వేధింపులను ప్రదర్శిస్తుంది. ఇదంతా, అస్సాంలో త్వరలో ఎన్నికలు జరగనున్నందువల్లే జరుగుతోంది. పౌరులను ఒకరిపై ఒకరిని ఉసిగొల్పడం ఇదంతటికీ తగినదేనా అని అడగాలనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితులలో, శర్మ, బీజేపీ అస్సాం యూనిట్‌ ఇద్దరిపై భారతీయ న్యాయ సంహిత, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి.

ఈ రెచ్చగొట్టే ధోరణిపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది షఫీక్ ఆర్ మహజీర్ మాట్లాడుతూ… “గోషామహల్ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ నాయకుడు రాజా సింగ్ ‘నేను ఈ దేశద్రోహ ముస్లింలను తుడిచిపెట్టేస్తాను’ అని అన్నప్పుడు… ‘కానీ మీరు దేశద్రోహి, ముస్లిం కాకపోతే, ఇది మీకు ఉద్దేశించినది కాదు’ అని అతను చెప్పగలడు. అదే నమ్మశక్యమైన నిరాకరణ,” అని ఆయన అన్నారు.

అస్సాం సీఎం శర్మ కూడా అన్ని విధాలా అదే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. లేదా అనుసరించకపోవచ్చు, ఎందుకంటే అతను ఈ విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదు.

అయినప్పటికీ, అస్సాం ముఖ్యమంత్రి చెప్పిన దానిపై ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేయాలి. అంతేకాదు ప్రత్యేకించి అధికార పార్టీ “సబ్ కా సాత్, సబ్ కా వికాస్” అని పదే పదే చెబుతున్నందున… దేశంలో శాంతి భద్రతలన్నింటికీ బాధ్యత వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి జవాబుదారీతనాన్ని కోరాలి. అస్సాం ముఖ్యమంత్రి తన మారణహోమ ప్రసంగంలో “సబ్ కా సాత్” కోరుకుంటుండవచ్చు, కానీ అది ఖచ్చితంగా “సబ్ కా వికాస్” కాదు.

ఒకవైపు ఉత్తరాఖండ్‌లో ఒక ముస్లిం దుకాణదారుడిపై బజరంగ్‌దళ్ గూండాల ద్వేషాన్ని ఎదుర్కొన్న “మహమ్మద్ దీపక్” ఉన్నాడు, మరోవైపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విభజన రాజకీయాలు చూస్తున్నాం.

హిమంత బిస్వా శర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడమే కాకుండా, తన ద్వేషానికి జవాబుదారీగా ఉండాలి. జైలు శిక్షను కూడా అనుభవించాలి. కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవలసిన సమయం ఇది. నేరం చేసినట్టు ఖచ్చితమైన రుజువులు లేనప్పటికీ మహేష్ రౌత్, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌ వంటి సామాజిక కార్యకర్తలను కఠినమైన ఉపా చట్టం కింద సంవత్సరాల తరబడి జైలుకు పంపి అక్కడే మగ్గిపోయేలా చేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో అస్సాం సీఎం శర్మ నేరాన్ని నిరూపించే వీడియోలు, ప్రసంగాలు ఉన్నాయి కాబట్టి అతడిని జైలుకు పంపాలి. ఎవరూ చట్టానికి అతీతులు కారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.