హైదరాబాద్: అమెరికా పౌరులను మోసం చేస్తున్న అహ్మదాబాద్లోని నకిలీ కాల్ సెంటర్లపై హైదరాబాద్ ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుజరాత్లోని ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
క్రిప్టోకరెన్సీ, నగదు స్వాధీనం
ఈ సోదాల్లో 12,000 విలువైన క్రిప్టోకరెన్సీని గుర్తించి, దానిని ED అధికారిక క్రిప్టో వాలెట్కు బదిలీ చేశారు. 31 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. నిందితులు తమను తాము యూఎస్ అధికారులమని చెప్పుకుంటూ, గిఫ్ట్ కార్డ్ల ద్వారా డబ్బులు వసూలు చేసి, హవాలా ద్వారా భారత్కు మళ్లించినట్లు గుర్తించారు.
సైబరాబాద్ పోలీసులు, CBI దాఖలు చేసిన FIRల ఆధారంగా దర్యాప్తు
సైబరాబాద్ పోలీసులు,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఢిల్లీ యూనిట్ నమోదు చేసిన FIRల ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు విదేశీ పౌరులను, ముఖ్యంగా అమెరికన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నారని దర్యాప్తులో తేలింది.
అధికారుల ప్రకారం…కాల్ సెంటర్ ఆపరేటర్లు అమెరికా ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ…పెండింగ్లో ఉన్న రుణాలు లేదా పన్ను ఎగవేత కేసుల ఆరోపణలతో బాధితులను బెదిరించారని, గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేయమని లేదా డిజిటల్ చెల్లింపులు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారుడు అకిబ్ ఘాంచితో పాటు, మహమ్మద్ అన్సారీ, వికాస్ కె నిమార్, దివ్యాంగ్ రావల్, ప్రదీప్ వి రాథోడ్ సహా ఇతరులను కీలక నిందితులుగా ఏజెన్సీ గుర్తించింది. డబ్బు జాడ, అదనపు అనుమానితుల ప్రమేయంపై తదుపరి దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోంది.

