హైదరాబాద్: సర్కారు బడుల్లో సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా మొదట రాష్ట్రంలోని 500లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి నాటికి సౌర విద్యుత్తు అందుబాటులోకి రానుంది. 12 జిల్లాల్లో రూ.32 కోట్లతో 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSREDCO) వివరాల ప్రకారం… ఇప్పటివరకు 100కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేశారు. మరో 453 పాఠశాలలకు వర్క్ ఆర్డర్లు జారీ చేశారని అధికారులు తెలిపారు.
“ప్రాజెక్ట్ యొక్క మొదటి దశలో, మేము సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేస్తాము. రాబోయే కొద్ది నెలల్లో మొత్తం 1,521 పాఠశాలల పనిని పూర్తి చేయాలని మేము భావిస్తున్నామని, ”తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీనియర్ అధికారి తెలిపారు.
గత సెప్టెంబరులో ‘టీఎస్ రెడ్కో’ (TSREDCO) సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించింది. 11 మంది బిడ్డర్లను ఖరారు చేసింది. ఎంపికైన కంట్రాక్టర్లు పాఠశాలల్లో 2 కిలోవాట్ల నుంచి 5 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్నారు. 200 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ఎంపిక చేశారు. మొత్తం ఎంపిక చేసిన 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో 916 సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, 605 పాఠశాలలు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నాయి.
సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయడం వల్ల పాఠశాలల వార్షిక విద్యుత్ బిల్లులు పెద్ద ఎత్తున తగ్గడమే కాకుండా అదనపు విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్కు బదిలీ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
“స్మార్ట్ తరగతులు, పెద్ద సంఖ్యలో కంప్యూటర్ సిస్టమ్లను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు ఇంటరాక్టివ్గా మారాయి. దీంతో కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. పాఠశాలల్లో అమర్చిన సోలార్ ప్యానెల్స్ వల్ల విద్యుత్ బిల్లు భారం తగ్గుతుంది, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుంది’’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పాఠశాలల్లో కంప్యూటర్లు, ఫ్యాన్లు, బల్బులు, బోరు మోటార్ నడవడా నికి అధికంగా విద్యుత్ను వినియోగిస్తుంటారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏర్పాటు చేసే సోలార్ విద్యుత్ పలకలతో ప్రతీ పాఠశాలలో రెండు కిలో వాట్స్ విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఒక కిలో వాట్ ఉత్పత్తికి రూ. 50 వేల చొప్పున ఒక్కో పాఠశా లకు రూ. లక్ష వరకు వ్యయం చేయనున్నారు. బ్యాటరీ ఇన్వర్టర్ల ద్వారా సోలార్ విద్యుత్ను నిల్వ చేసుకొని పాఠశాలల్లో అవసరం మేరకు వినియోగించుకోనున్నారు.