హైదరాబాద్: మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి 2019 నుంచి 2022-23 వరకు మొత్తం రూ.101.27 కోట్ల నిధులు తెలంగాణ ఉర్దూ అకాడమీకి కేటాయించారు. అయితే రూ.61.96 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఉర్దూ అకాడమీ అధికారులు ప్రభుత్వానికి అందించిన వివరాల ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉర్దూ పరిరక్షణ, ప్రోత్సాహం కోసం 4.27 కోట్లు కేటాయించగా అందులో రూ.2.13 కోట్లు విడుదల చేసినా అకాడమీ ఖర్చు చేసింది రూ.69.25 లక్షలు మాత్రమే.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా పథకం అమలుకు ప్రభుత్వం నుంచి రూ.26.33 కోట్లు కేటాయించగా అందులో రూ.25.5 కోట్లు విడుదల చేసారు. అయితే ఈ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలిసిన నిర్దిష్ట అధికారులు ఎవరూ లేరని మైనార్టీ సంక్షేమ శాఖ పేర్కొంది. గత నాలుగేళ్లలో అకాడమీ ఖర్చు చేసిన రూ.37.77 కోట్లలో ఒక్క ‘ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా పథకానికే‘ రూ.32.7 కోట్లు ఖర్చు చేశారు.
అసలు ఈ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తున్నారనే దానిపై విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గణాంకాలను ఉర్దూ అకాడమీ స్వయంగా మైనారిటీ సంక్షేమ శాఖకు సమర్పించింది, అయితే ఈ నిధులను ఏ ఉర్దూ ఘర్-కమ్-షాదీ ఖానా కోసం ఖర్చు చేస్తున్నారో పేర్కొననే లేదు.
ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా పథకానికి ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.54.81 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో ఉర్దూ భాషాభివృద్ధికి, ప్రోత్సాహానికి రూ.17.81 కోట్లు కేటాయించగా, నాలుగేళ్లలో రూ.5.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీనికి విరుద్ధంగా ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా పథకానికి రూ.32.7 కోట్లు ఖర్చు చేశారు.
ఉర్దూ అకాడెమీ… ఉర్దూ అభివృద్ధి, ప్రచారం కంటే ఉర్దూ ఘర్-కమ్-షాదీ ఖానా పథకంపై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంది? వాటిని ఎక్కడ నిర్మిస్తున్నారు? అనే అంశాలపై మాత్రం స్పష్టత లేదు.
షాదీఖానా పేరుతో లేనిపోని భారీ మొత్తంలో ఎందుకు ఖర్చు చేస్తున్నారు?
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మినీ హజ్ హౌస్ పేరుతో భవనాల ఏర్పాటుకు మైనారిటీ సంక్షేమ శాఖ ఆమోదం తెలుపుతోందని, ఈ ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానాను అన్ని జిల్లాల్లో నిర్మిస్తే మినీ హజ్ వల్ల ఉపయోగం ఏముంటుంది? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా ఉర్దూ అకాడమీ ఖర్చు చేసిన మొత్తం బడ్జెట్పై ఉన్నత స్థాయి విచారణ అనివార్యమైంది.