హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పెంపుపై ఫిర్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫీజు నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఎక్కువ డబ్బు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎక్కువగా వసూలు చేసిన మొత్తాన్ని రికవరీ చేయాలని పేర్కొన్నారు.
ఈమేరకు జరిగిన సమీక్షా సమావేశంలో, విద్యా మంత్రి కూడా అయిన సీఎం, ఈ విషయంపై తల్లిదండ్రులు ఫిర్యాదులు లేదా సూచనలను సమర్పించడానికి వీలుగా ఆన్లైన్ యంత్రాంగాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
గత నెలలో, తెలంగాణ విద్యా కమిషన్ పాఠశాలలు, కళాశాలలు రెండింటినీ కవర్ చేస్తూ ప్రైవేట్ విద్యా రంగంలో ఫీజులను నియంత్రించడానికి ఒక బిల్లును ప్రతిపాదించింది. దీని కోసం ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ వారం ప్రారంభంలో తెలంగాణ విద్యా విధానాన్ని ముఖ్యమంత్రికి సమర్పించారు.


