టెహ్రాన్: ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై అమెరికాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూఎస్ ఏకైక లక్ష్యం మా చమురు, సహజ వనరులపై నియంత్రణ సాధించడం, దేశాన్ని విభజించడం అని ఆయన ఆరోపించారు.
“మేము పూర్తిగా దౌత్యపరమైన చర్చలో నిమగ్నమై ఉండగా వారు యుద్ధం చేశారు,” అని ఆయన అన్నారు, “కాబట్టి, మేము … మా దేశాన్ని ఒక్క తాటిపై నిలబడి కాపాడుకుంటున్నామని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి అన్నారు.”
“మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం, మా ప్రజలను ఓడించడం, మా మానవత్వాన్ని అణగదొక్కడమే అమెరికా లక్ష్యం, కానీ ఇరానియన్లు తమ నేలను రక్షించుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు” అని ఆయన అన్నారు.
కాగా, అమెరికా- ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్లో మరణాల సంఖ్య 1,255 కు చేరుకుంది. 12,000 మంది గాయపడ్డారు. బాధితుల వయస్సు ఎనిమిది నెలల నుండి 88 సంవత్సరాల వరకు ఉందని అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇరాన్ ఉప ఆరోగ్య మంత్రి అలీ జాఫారియన్ తెలిపారు. అంతేకాదు “ఇరాన్ 11 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులను కోల్పోయింది, వీరిలో నలుగురు వైద్యులు, ఇద్దరు నర్సులు, ముగ్గురు అత్యవసర కార్మికులు అని తెలిపారు. 55 మంది గాయపడ్డారు” అని ఆయన అన్నారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, ఇరాన్ తన పొరుగు దేశాలతో సంబంధాల గురించి బఘాయి మాట్లాడుతూ, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి కట్టుబడి ఉందని అన్నారు. “కానీ ఇతర దేశాల భూభాగాలను మాపై దాడులు చేయడానికి ఉపయోగిస్తే మమ్మల్ని మేము రక్షించుకునే హక్కు మాకు ఉంది” అని ఆయన అన్నారు.
“మా రక్షణ చర్యను ఈ దేశాలలో దేనిపైనా శత్రుత్వ చర్యగా అర్థం చేసుకోలేము” అని ఆయన అన్నారు. టర్కి, సైప్రస్, అజర్బైజాన్లపై ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ ప్రమేయాన్ని కూడా ఆయన ఖండించారు. “ఈ దేశాలపై ఇరాన్ భూభాగం నుండి ఎటువంటి దాడులు ప్రారంభించలేదు. మనకు, ఇతర దేశాల మధ్య చీలికను తీసుకురావడానికి శత్రువు కొన్ని దాడులకు పాల్పడవచ్చని మేము పదేపదే హెచ్చరించాము” అని ఆయన అన్నారు.
ఇరాన్ కొనసాగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ…”ఇది ఎంపిక చేసుకున్న యుద్ధం కాదు. ఇది మాపై విధించిన తప్పనిసరి యుద్ధం” అని ఆయన అన్నారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే సాయుధ దళాలకు నివాళులు అర్పిస్తూ బాఘై తన సమావేశాన్ని ముగించారు. “మీ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేము” అని ఆయన అన్నారు.
ఇరాన్ బహ్రెయిన్లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం BAPCOను లక్ష్యంగా చేసుకుంది
బహ్రెయిన్లోని సిత్రా సమీపంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం BAPCOను ఇరానియన్ డ్రోన్ లక్ష్యంగా చేసుకుంది, దీని వలన విస్తృత నష్టం వాటిల్లింది. దట్టమైన పొగ ఆ సౌకర్యాన్ని, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టింది.
ఇరాన్ 10వ రోజు కూడా పూర్తిగా ఇంటర్నెట్ను నిలిపివేసింది
ఇరాన్పై US-ఇజ్రాయెల్ దాడి పదవ రోజుకు చేరుకుంది. ఇరానియన్లకు ఇంకా ఇంటర్నెట్ అందుబాటులోకి రాలేదు. ఏకంగా 216 గంటలపాటు నెట్ లేకుండా ఉన్నారని సైబర్ సెక్యూరిటీ వాచ్డాగ్ నెట్బ్లాక్స్ నివేదించింది. “ఇరాన్ విధించిన షట్డౌన్తో దాదాపు 90 మిలియన్ల మంది ఇరానియన్లకు మిగతా ప్రపంచం నుంచి సంబంధాలు తెగిపోయాయి” అని నెట్బ్లాక్స్ తన తాజా రోజువారీ నివేదికలో తెలిపింది.
ఇజ్రాయెల్ సైన్యం తెల్ల భాస్వరాన్ని ఉపయోగిస్తోంది: హ్యూమన్ రైట్స్ వాచ్
దక్షిణ లెబనాన్లోని నివాస ప్రాంతాలలో తెల్ల భాస్వరపు జాడలు కనుగొన్నారు, వీటితో ఇజ్రాయెల్ మార్చి 3న దాడి చేసింది, హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) దీనిని “అంతర్జాతీయ మానవతా చట్టం పూర్తి ఉల్లంఘన” అని పేర్కొంది.
ఇజ్రాయెల్ సైన్యం తెల్ల భాస్వరం మందుగుండు సామగ్రిని పౌరులపై ప్రయోగించినట్లు చూపించే ఏడు ఫోటోలను ప్రదర్శించడం ద్వారా రసాయనం ఉనికిని ధృవీకరిస్తూ ఒక కొత్త నివేదికను విడుదల చేసింది.
మరోవంక యుద్ధం పదవరోజుకు చేరడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధి పనిచేయకపోవడంతో, చమురు ధరలు బ్యారెల్కు దాదాపు USD 120 చేరుకుంది. మరోవంక మార్చి 7న ఇజ్రాయెల్ 30 ఇరానియన్ ఇంధన డిపోలపై బాంబు దాడి చేయడంతో అమెరికా సంతోషంగా లేదని నివేదికలు పేర్కొన్నాయి. ఇది మిత్రదేశాల మధ్య పెద్ద విభేదాలకు దారితీసింది. ఈ దాడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి నలుగురు మరణించినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ ఆలస్యంగా నివేదించింది.
