Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

జూన్ 2024 నుండి ఒడిశాలో 54 మత ఘర్షణలు, 7 మూక దాడులు…అసెంబ్లీకి తెలిపిన సీఎం!

Share It:

భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అంటే జూన్ 2024 నుండి రాష్ట్రవ్యాప్తంగా 54 మత ఘర్షణలు, ఏడు మూక దాడుల (mob lynching) కేసులు నమోదయ్యాయని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్ర శాసనసభకు తెలియజేశారు. ఈ ఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలు, మత సామరస్యంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

గౌతమ్ బుద్ధ దాస్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ముఖ్యమంత్రి ఈ ఘటనలకు సంబంధించిన జిల్లా వారీ వివరాలను, శాంతిభద్రతల సంస్థలు తీసుకున్న చర్యలను సభ ముందు ఉంచారు.

ప్రభుత్వ సమాధానం ప్రకారం… అత్యధిక సంఖ్యలో మత ఘర్షణల ఘటనలు బాలాసోర్ జిల్లాలో నమోదయ్యాయి; ఈ కాలంలో అక్కడ 24 కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాతి స్థానంలో ఖుర్దా జిల్లా నిలిచింది, రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కూడా ఈ జిల్లా పరిధిలోనే ఉంది; ఇక్కడ 16 ఘటనలు నమోదయ్యాయి. మిగిలిన ఘటనలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి నమోదయ్యాయి.

మత ఘర్షణల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై దాదాపు 300 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, ఇప్పటివరకు సగం కంటే తక్కువ కేసుల్లోనే అభియోగపత్రాలు (chargesheets) దాఖలు చేసారు. దీనిని బట్టి అనేక ఘటనలకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అర్థమవుతోంది. న్యాయ ప్రక్రియను పూర్తి చేసేందుకు పోలీసులు సాక్ష్యాలను సేకరించడం, అనుమానితులను విచారించడం కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు.

మూక దాడుల (mob lynching) సమస్య కూడా ఒక తీవ్రమైన ఆందోళన అంశంగా మారింది. అసెంబ్లీలో పంచుకున్న వివరాల ప్రకారం, ఇదే కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏడు మూక దాడుల కేసులు నమోదయ్యాయి.

రాయగడ జిల్లా నుండి మూడు మూక దాడుల ఘటనలు నమోదయ్యాయి; ఈ కేసులకు సంబంధించి పోలీసులు 48 మందిని అరెస్టు చేశారు. ధెంకనాల్ జిల్లా నుండి రెండు ఘటనలు నమోదయ్యాయి. అయితే, ధెంకనాల్ కేసుల్లో ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు జరగలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు, దీనిని బట్టి అక్కడ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా దేవగఢ్, బాలాసోర్ జిల్లాల నుండి ఒక్కో మూక దాడి కేసు నమోదైంది. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు పదమూడు మందిని అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో మరిన్ని మూక దాడులు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అనేక చర్యలను ప్రారంభించిందని తెలిపింది. ఈమేరకు అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన సీఎం… వివిధ వర్గాల ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు అనేక సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. “మత అల్లర్లు,మూకదాడుల సంఘటనలను నివారించడానికి చర్యలు తీసుకున్నాము. దీని కోసం వివిధ ప్రదేశాలలో శాంతి కమిటీలను ఏర్పాటు చేసాము” అని ముఖ్యమంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. “స్థానిక ప్రభుత్వాలు సమాజాల మధ్య సామరస్యాన్ని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రహస్య సమాచారాన్ని సేకరించడం, ఇబ్బందులను సృష్టించేవారిని పర్యవేక్షించడం ద్వారా శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించే వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నాము.”

ముఖ్యంగా గతంలో మతపరమైన ఉద్రిక్తతలు నమోదైన ప్రాంతాలలో, రాష్ట్ర పోలీసులు, జిల్లా పరిపాలనలు నిఘా పెంచాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. చిన్న వివాదాలు పెద్ద ఘర్షణలుగా మారకుండా నిరోధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

కాగా, అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు పెరుగుతున్న మతపరమైన సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. నివారణ చర్యల ప్రభావాన్ని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించడానికి బాధ్యులపై బలమైన పోలీసింగ్, వేగవంతమైన దర్యాప్తు. కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

అసెంబ్లీలో సమర్పించిన డేటా ప్రకారం శాంతిని కాపాడుకోవడానికి, మతపరమైన ఉద్రిక్తతలు హింసగా మారకుండా చూసుకోవడానికి అటు ప్రభుత్వం, ఇటు పౌర సమాజం నిరంతర ప్రయత్నాల అవసరాన్ని హైలైట్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఒడిశా ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటానికి, అల్లర్లు లేదా మూక హింసలో పాల్గొన్న వారిని న్యాయం ముందు నిలబెట్టడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.