న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఢిల్లీలో గ్యాస్ కొరత తీవ్రమైంది. స్థానికులు గ్యాస్ సిలిండర్ల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దక్షిణ ఢిల్లీలోని సాకేత్, హౌజ్ రాణి,రద్దీగా ఉండే కల్కాజీ ప్రాంతంతో సహా అనేక ప్రదేశాల్లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు సిలిండర్లకోసం ఏజెన్సీ ఆపరేటర్లతో గొడవకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు హింసాత్మకంగా కూడా మారాయి. ఏజెన్సీ ఆపరేటర్లు కోపంగా ఉన్న కస్టమర్లకు పరిస్థితికి తాము బాధ్యులం కాదని వివరించడానికి ప్రయత్నించారు.
ఇదిలా ఉండగా…దేశంలో గ్యాస్ కొరత లేదని భారత ప్రభుత్వం పార్లమెంటులో నొక్కి చెప్పింది. అయితే చాలా మంది ఏజెన్సీ ఆపరేటర్లు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినప్పుడు కొరత ఉందని వారు అంగీకరించారు.
గ్యాస్ సిలిండర్లు ఎందుకు అందుబాటులో లేవు?
ఇప్పటివరకు ఎంతోమంది వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఒక నంబర్కు డయల్ చేసి, సూచనలను అనుసరించి బుకింగ్ చేసుకునే వారు. అయితే ఆ మొబైల్ నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు.
కాగా, ఢిల్లీలోని మహేశ్వరి గ్యాస్ వద్ద వేచి ఉన్న ఒక వినియోగదారుడు, “ఐదు సంవత్సరాలలో నేను సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఏజెన్సీని సందర్శించాల్సి రావడం ఇదే మొదటిసారి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి సమస్యను ఎదుర్కోలేదు.”
ఏజెన్సీలో ఉద్యోగి అశోక్ మాట్లాడుతూ, “బుకింగ్లను ప్రాసెస్ చేయకుండా నిరోధించే సర్వర్ సమస్య ఉంది. మా వెబ్సైట్ కూడా డౌన్ అయింది.”
అలాగే సాకేత్లోని సోధి గ్యాస్ ఏజెన్సీలో అమిత్, “సర్వర్ ఉదయం 5 గంటలకు నడుస్తోంది, కానీ ఉదయం 9 గంటల తర్వాత అది ఆఫ్లైన్లోకి వెళ్లిపోయింది” అని అన్నారు.
హౌజ్ రాణి ఏరియాలోని ఆర్కె గ్యాస్ ఏజెన్సీ యజమాని మాట్లాడుతూ… “సర్వర్ సమస్య” విషయంలో తమ బృందం ప్రధాన కార్యాలయంతో సమన్వయం చేసుకుంటోందని చెప్పారు. “దీనిని పరిష్కరిస్తున్నట్లు మాకు సమాచారం అందింది” అని ఆమె అన్నారు.
దక్షిణ ఢిల్లీలోని ఒక గ్యాస్ ఏజెన్సీ ఆపరేటర్ ఈ పరిస్థితిపై మాట్లాడుతూ… బుకింగ్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో ఉన్నందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. “ఆఫ్లైన్ బుకింగ్కు ఎంపిక లేదు, కాబట్టి మా వద్ద గ్యాస్ అందుబాటులో ఉన్నప్పటికీ, మేము దానిని వినియోగదారులకు సరఫరా చేయలేకపోతున్నాము. గ్యాస్ వినియోగాన్ని పరిమితం చేయడానికి, స్టాక్ను ఆదా చేయడానికి ప్రభుత్వం ఈ పద్ధతిని అమలు చేసింది” అని ఆయన అన్నారు.
మహేశ్వరి గ్యాస్ ఉద్యోగి అశోక్ మాట్లాడుతూ, “ఆఫ్లైన్ బుకింగ్లను అంగీకరించమని మాకు సూచనలు అందితే, ఎటువంటి సమస్యలు ఉండవు.”
అయితే, ఈ ప్రక్రియను ఆఫ్లైన్లో మార్చడం వల్ల సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పెరగవచ్చని కొందరు ఏజెన్సీ ఆపరేటర్లు విశ్వసిస్తున్నారు.
బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్లు ఎందుకు డెలివరీ చేయట్లేదు?
సంజయ్ క్యాంప్ నివాసి కమలా దేవి (60) మార్చి 5న సిలిండర్ బుక్ చేసుకున్నారు, కానీ మార్చి 11 వరకు ఆమెకు అది అందలేదు. కమలాకు బుకింగ్ నిర్ధారణ, DAC (డెలివరీ ప్రామాణీకరణ కోడ్) సందేశం వచ్చింది.
“సిలిండర్ పొందడానికి ఏజెన్సీ నుండి ఒక చీటీ (slip) తీసుకురమ్మని డెలివరీ ఏజెంట్ నాతో చెప్పారు,” అని ఆమె అన్నారు. “నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఏజెన్సీ వారు నాకు ఆ చీటీ ఇవ్వడానికి నిరాకరించారు.” కమలా దేవి నివాసానికి గ్యాస్ సరఫరా చేసే ఏజెంట్, ఆమె ఫోన్ కాల్స్కు స్పందించడం మానేశారు.
ఢిల్లీలోనే మరొక వినియోగదారుడు మాట్లాడుతూ… తాము మార్చి 5న ఆర్డర్ చేశామని, అప్పుడు సిలిండర్ ధర రూ. 878గా ఉందని, కానీ ఇప్పుడు ఆ ధర రూ. 913కు పెరిగిందని తెలిపారు.
“కొత్త ధరనే వర్తిస్తుందని ఏజెన్సీ వారు చెబుతున్నారు,” అని ఆయన అన్నారు. “నేను ఆ డబ్బు చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నాను, అయినా సరే వారు నాకు సిలిండర్ ఇవ్వడం లేదని ఆయన వాపోయారు.”
కాగా, ఎల్పిజి సిలిండర్ల కొరతను నిరసిస్తూ, ఎల్పిజి ధరల పెరుగుదలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశ రాజధాని అంతటా వంట గ్యాస్ ఏజెన్సీల వెలుపల వేలాది మంది ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు.
ఇంధన కొరత లేదన్న కేంద్రం వాదనను ప్రశ్నిస్తూ, గ్యాస్ ఏజెన్సీల వెలుపల పొడవైన క్యూలు, సిలిండర్ల బుకింగ్పై ఆంక్షలు సరఫరా సంక్షోభాన్ని సూచిస్తున్నాయని ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ అన్నారు.

