న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒక ఓలా డ్రైవర్…ముస్లిం ప్రయాణికులను ఉద్దేశపూర్వకంగా బెదిరించిన ఒక ఆందోళనకర సంఘటనను సుప్రీం కోర్టు న్యాయవాది డాక్టర్ సైఫ్ మహమూద్ మీడియాకు వివరించారు.
“రైడ్ మొదలైన కొద్దిసేపటికే, డ్రైవర్ నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. తాను కాన్పూర్కు చెందినవాడినని చెప్పి, ఢిల్లీలోని ‘జాట్ల’లా కాకుండా, ప్రజలతో ఎలా గౌరవంగా ప్రవర్తించాలో తనకు తెలుసని గొప్పలు చెప్పుకున్నాడు. ఆ తర్వాత, ‘లేకిన్ కోయి ఉల్టీ బాత్ కరే తో ఇలాజ్ తో కర్నా పడతా హై (కానీ ఎవరైనా హద్దులు దాటి మాట్లాడితే, వాళ్ళ పని పట్టాల్సిందే)’ అని అన్నాడని” మహమూద్ వార్తాసంస్థతో అన్నారు.
ఈమేరకు మార్చి 16న ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) భవిష్ అగర్వాల్కు రాసిన లేఖలో, తన ఇటీవలి ఓలా ప్రయాణంపై ఆ న్యాయవాది తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనను వ్యక్తం చేశారు.
మార్చి 15న జరిగిన ఒక ప్రయాణంలో, ఆ డ్రైవర్ వేర్వేరు సంఘటనలలో ప్రయాణికులను దారుణంగా కొట్టినట్లు గొప్పలు చెప్పుకున్నాడని ఆరోపించారు. వారు ముస్లింలు కావడం, తన వాహనంలో మాంసాహారం తినడం వంటి కారణాలను అతను పేర్కొన్నాడు.
డ్రైవర్ చర్యలను మహమూద్ బహిరంగ ఇస్లామోఫోబియాగా, వాహనంలోనే తనను బెదిరించే ప్రయత్నంగా అభివర్ణించారు.
ఒక సంఘటనను వివరిస్తూ, యాప్లో శ్రీ రామ్ అని పేరున్న ఆ డ్రైవర్, తన వాహనంలో మాంసాహారం తింటున్నాడనే కారణంతో ఒక ముస్లిం ప్రయాణికుడిని దారుణంగా కొట్టినట్లు చెప్పాడు. అతను ఒక ధాబా వద్ద ఆగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఉన్న ఇతరులు కూడా ఆ వ్యక్తిని కొట్టి, అతని కాళ్లు విరగ్గొట్టారని అతను చెప్పాడు.
దానికి ప్రతిగా, ఆ ప్రయాణికుడు “తన మనుషులను” పోగుచేసి “డ్రైవర్ను ముక్కలు ముక్కలుగా నరుకుతానని” బెదిరించినట్లు డ్రైవర్ తెలిపాడు. దాంతో, అతను తన గమ్యస్థానానికి చేరుకోలేని స్థితిలో ఉండగా, డ్రైవర్ అతడిని అక్కడే వదిలేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.
“అతను ఈ మొత్తం సంఘటనను ఎంతో గర్వంగా వివరించాడు, ప్రతి అడుగులోనూ హింసను బహిరంగంగా కీర్తించాడు,” అని డాక్టర్ మహమూద్ తన లేఖలో పేర్కొన్నారు.
మరో సంఘటనను వివరిస్తూ, నోయిడాలో కూడా తాను ఇదే విధంగా ఒక వ్యక్తిపై దాడి చేశానని, రెండవ బాధితుడు కూడా ముస్లిం అని ఆ డ్రైవర్ పరోక్షంగా సూచించాడని న్యాయవాది మహమూద్ తెలిపారు.
కాగా, “డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు ఇది ఉద్దేశపూర్వకంగా, లక్ష్యంగా చేసుకుని చేసిన ఇస్లామోఫోబియా అని పలు సందర్భాల్లో వెల్లడించాయి. తాను ముస్లింలపై దాడి చేశానని పదే పదే చెప్పుకున్నాడు. అంతేకాక, ‘ఇలాంటి వారికి గుణపాఠం నేర్పడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బాగా పనిచేస్తోంది’ అని కూడా పేర్కొన్నాడని” మహమూద్ అన్నారు.
డ్రైవర్ ఆ సంఘటనలను వివరించిన తీరు, విషయం, విధానం తన మత గుర్తింపు కారణంగా “నన్ను భయపెట్టడానికే స్పష్టంగా ఉద్దేశించినవేనని” మహమూద్ అన్నారు.
“ఇవి యాదృచ్ఛికమైన వ్యాఖ్యలు కావు,” అని ఆ న్యాయవాది అన్నారు. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా మత హింసను పదేపదే ప్రశంసిస్తూ, ప్రజల ప్రతీకారాన్ని సమర్థిస్తూ తన కథలను చెప్పి తనను భయపెట్టాడు.
ఈ రైడ్పై ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ డ్రైవర్లు ప్రచారం చేస్తున్న మత విద్వేషాన్ని, ఇస్లామోఫోబియాను, హింసను కీర్తించడాన్ని ఓలా సంస్థ సమర్థిస్తోందా, సహిస్తోందా, లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తోందా అని మహమూద్ ఓలా సంస్థను ప్రశ్నించారు.
ప్రయాణికులందరి పట్ల వివక్ష చూపకపోవడంపై తమ విధానాలు ఏమిటో, వాటిని ఎలా అమలు చేస్తున్నారో, డ్రైవర్లు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకోకుండా నిరోధించడానికి ఎలాంటి రక్షణ చర్యలు ఉన్నాయో కంపెనీ స్పష్టంగా వివరించాలని ఆ న్యాయవాది ఓలాను డిమాండ్ చేశారు.
ఆ డ్రైవర్పై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనే దానిపై ఓలా తక్షణమే స్పందించాలని డాక్టర్ మహమూద్ కోరారు.
“ఇక్కడ లేవనెత్తిన సమస్యలు నా వ్యక్తిగత భద్రతకు మాత్రమే కాకుండా, ప్రజల భద్రతకు, మీ ప్లాట్ఫామ్ కింద పనిచేస్తున్న వ్యక్తుల ద్వారా అదుపు లేకుండా జరుగుతున్న మత హింస వ్యాప్తికి కూడా సంబంధించినవి” అని ఆ న్యాయవాది అన్నారు.
కంపెనీ నుండి స్పందన రాకపోతే, ఈ విషయాన్ని పై అధికారులకు తీసుకువెళ్తానని, తాను ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, ఢిల్లీ హైకోర్టుకు తీసుకువెళ్లానని ఆయన తెలిపారు.
