జెనీవా: ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై “పాలస్తీనియన్లను హింసించడానికి ఇజ్రాయెల్ లైసెన్స్ పొందిందని” జెనీవాలోని మానవ హక్కుల మండలిలో ఒక కొత్త నివేదికను సమర్పిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి వాపోయారు.
ఇది “పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న మారణహోమాన్ని” నమోదు చేస్తుందని, “పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు, ఇజ్రాయెల్ హింసను క్రమపద్ధతిలో ఉపయోగించడాన్ని” ఇది హైలైట్ చేస్తుందని ఫ్రాన్సెస్కా అల్బనీస్ అన్నారు.
దురాగతాలకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఆమె ఆరోపించారు, “మీ ప్రభుత్వాలలో చాలా వరకు, మీ మంత్రులు దీనిని అనుమతించినందున, పాలస్తీనియన్లను హింసించడానికి ఇజ్రాయెల్కు లైసెన్స్ ఇచ్చినట్లైందని” అన్నారు.
నివేదిక ప్రకారం… అక్టోబర్ 2023-జనవరి 2026 మధ్య, ఇజ్రాయెల్ దళాలు పిల్లలతో సహా 18,500 మందికి పైగా పాలస్తీనియన్లను అరెస్టు చేశాయి, దాదాపు 100 మంది కస్టడీలో మరణించారు, సుమారు 4,000 మంది బలవంతంగా అదృశ్యమయ్యారు.
వేలాది మందిని ఎలాంటి అభియోగం లేకుండా నిర్బంధించి, అమానవీయ పరిస్థితులలో ఉంచారని నివేదిక పేర్కొంది. నిర్బంధంలో ఉన్నవారిలో వైద్యులు, పాత్రికేయులు, మానవతావాదులు ఉన్నారని ఆమె తెలిపారు.
“అక్టోబర్ 2023 నుండి, హింస ప్రభుత్వ విధానంగా మారింది” అని నివేదకురాలు నొక్కిచెప్పారు. ఈ వ్యవస్థ “సామాజికంగా నిర్మితమై, రాజకీయంగా మద్దతు పొంది, బహిరంగంగా సాధారణీకరించారని” ఆమె వర్ణించారు.
పాలస్తీనా ఖైదీలకు మరణశిక్షను ప్రవేశపెట్టే ప్రతిపాదిత ఇజ్రాయెల్ బిల్లు “మరో ప్రమాదకరమైన ఉద్రిక్తతను సూచిస్తుంది” అని కూడా అల్బనీస్ హెచ్చరించారు. ఇటామర్ బెన్-గ్విర్, బెజాలెల్ స్మోట్రిచ్, ఇజ్రాయెల్ కాట్జ్లతో సహా అధికారులపై విచారణ జరపాలని, అవసరమైన చోట అరెస్టు వారెంట్లు జారీ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ వేధింపులు నిర్బంధ కేంద్రాలకే పరిమితం కాదని, ఆక్రమిత పాలస్తీనా భూభాగం అంతటా “హింసాత్మక వాతావరణం” నెలకొని ఉందని, ఇందులో ఇళ్లు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాల విధ్వంసం, బలవంతంగా నిరాశ్రయుల్ని చేయడం, ఆకలి వంటివి ఉన్నాయని ఆమె నివేదిక వర్ణించింది.
“ఈ సందర్భంగా నమోదు చేస్తున్న సాక్ష్యాలు… కేవలం బాధాకరమైన విషాద గాథలు మాత్రమే కాదు; అవి ఆక్రమిత భూభాగం అంతటా, సంపూర్ణ నేరపూరిత ప్రవర్తన ద్వారా పాలస్తీనా ప్రజలందరినీ లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోరమైన నేరాలకు సాక్ష్యాలు,” అని అల్బనీస్ అన్నారు.
ఆమె పరిస్థితిని తీవ్రమైన పదజాలంతో వివరిస్తూ… “జాతి నిర్మూలన అనేది హింస అంతిమ రూపంగా మారింది: ఇది నిరంతరమైనది, తరతరాలుగా కొనసాగుతున్నది, సామూహికమైనదని” ఆమె ముగించారు.
“ఈ దురాగతానికి మీరు స్పందించే విధానమే మన సామూహిక చట్టపరమైన, నైతిక బాధ్యతకు పరీక్ష అవుతుందని” ఆమె జోడించారు. ఉల్లంఘనలను అరికట్టకపోతే, అవి మరింత విస్తృతమైన పర్యవసానాలకు దారితీస్తాయని చివరగా హెచ్చరించారు.
“అంతర్జాతీయ చట్టాల పట్ల చూపించే నిర్లక్ష్యం పాలస్తీనాకే పరిమితం కాదు—ఇరాన్, గల్ఫ్ దేశాలు, లెబనాన్, వెనిజులా ప్రజలకు ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం; కాలక్రమేణా ఈ పరిణామాలు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలను కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది,” అని ఆమె నొక్కి చెప్పారు. మొత్తంగా “పాలస్తీనాలో ఏది కోల్పోతుందో, అది మనమందరం కోల్పోయినట్లే.”

