జెనీవా: గాజాలో పరిస్థితి “చాలా కష్టంగా ఉంది” అని శాంతి మండలికి చెందిన ఒక సీనియర్ అధికారి హెచ్చరించారు. ఈమేరకు పాలస్తీనాపై జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో, గాజా శాంతి మండలి ప్రతినిధి నికోలే మ్లాడెనోవ్ మాట్లాడుతూ… “మొదటి దశ అమలు తర్వాత గణనీయమైన మెరుగుదల ఉన్నప్పటికీ, గాజాలో పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది” అని అన్నారు.
“యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో అత్యవసర సేవలు చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. పనిచేస్తున్న ఆర్థిక వ్యవస్థ ఏదీ లేదని ఆయన అన్నారు.”
ఈమేరకు మ్లాడెనోవ్ మాట్లాడుతూ మూడు తక్షణ ప్రాధాన్యతలను సూచించారు. మొదటిది “రఫా క్రాసింగ్ తెరిచి ఉంచాలి. గాజాలోకి, బయటకు ఎక్కువ మంది ప్రజలను అనుమతించాలి,” అని అన్నారు. “దాని కార్యకలాపాలపై ఏ ఆంక్షలైనా కాల్పుల విరమణ రెండవ దశ అమలుకు నేరుగా ఆటంకం కలిగిస్తాయని” ఆయన హెచ్చరించారు.
మానవతా సహాయంపై ఆయన మాట్లాడుతూ, “అవసరాల స్థాయికి ప్రస్తుత సహాయం సరిపోవడం లేదని” అన్నారు. “త్వరలో గాజాలోకి వస్తువులను తీసుకురావడానికి అనుమతించిన ట్రక్కుల సంఖ్య పెరుగుతుందని” ఆయన నొక్కి చెప్పారు. ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధంగా ఉంది, కానీ ప్రవేశ మార్గాలను మెరుగుపరచాలి” అని ఆయన అన్నారు.
“20 లక్షల మందికి పైగా ప్రజలు అమానవీయ జీవన పరిస్థితులను ఇకపై భరించలేరు” అని పేర్కొంటూ, తాత్కాలిక గృహ నిర్మాణ పరిష్కారాలను వేగవంతం చేయాలని కూడా ఆయన ప్రోత్సహించారు.
సహాయంలో అంతరాలు
“ఏ ప్రణాళికా పరిపూర్ణమైనది కాదు” అని నొక్కి చెబుతూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాలని మ్లాడెనోవ్ కోరారు. “ఆయుధాల ఉపసంహరణ, పునర్నిర్మాణం, పౌర పరివర్తన, పాలస్తీనా సంస్థల ఏకీకరణను ఒకే క్రమంలో అనుసంధానించే ఏకైక పత్రం ఇదే” అని ఆయన అభివర్ణించారు.
“ఇజ్రాయెలీయులు,పాలస్తీనియన్ల మధ్య శాంతిని పెంపొందించడం పట్ల మనం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, ఈ ప్రణాళికను అమలు చేయడం పట్ల కూడా అంతే చిత్తశుద్ధితో ఉండాలి” అని ఆయన అన్నారు. కాగా, మానవతా ప్రయత్నాలు ఇంకా సరిపోవడం లేదని యునైటెడ్ స్టేట్స్ కూడా అంగీకరించింది.
“ఖచ్చితంగా, ఇంకా చాలా పని చేయాల్సి ఉంది. మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది,” అని అదే సమావేశంలో యూఎస్ రాయబారి మైక్ వాల్ట్జ్ అన్నారు. “గాజా లోపల మానవతా సహాయానికి మార్గాన్ని బలోపేతం చేయడానికి వాషింగ్టన్ ఈ సభలోని మా భాగస్వాములతో ప్రతిరోజూ పనిచేస్తోంది” అని ఆయన తెలిపారు.
మరింత మన్నికైన గృహవసతి, ఆరోగ్య సేవలు అవసరమని ఆయన అన్నారు. గత కొన్ని నెలలుగా వారానికి 4,000కు పైగా సహాయ ట్రక్కులు వచ్చినా, అప్పటి నుంచి ఆ సంఖ్య తగ్గిందని ఆయన పేర్కొన్నారు.

