హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే పుకార్లతో హైదరాబాద్లోని పలు పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ నెలకొంది. పొడవైన క్యూలలో వాహనదారులు పెట్రోల్ కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొనుగోళ్లు ఎక్కువగా జరగడంతో పలు బంకుల వద్ద ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు ప్రదర్శించారు.
మరోంక సిఎన్జి అవుట్లెట్ల వద్ద, ఇంధనం నింపుకోవడానికి ఆటోరిక్షాలు పొడవైన క్యూలలో వేచి ఉండటం కనిపించింది. ఇది ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ, రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, లేదా గృహ వినియోగ ఎల్పిజి కొరత అస్సలు లేదని స్పష్టంగా తెలియజేసింది. చమురు శుద్ధి కర్మాగారాల నుండి స్థానిక డిపోల వరకు సరఫరా వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, అన్ని జిల్లాల్లోని పౌరులందరి రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆ శాఖ తెలిపింది.
తప్పుడు పుకార్ల కారణంగా కొన్ని రిటైల్ పెట్రోల్ అవుట్లెట్ల వద్ద పొడవైన క్యూలు, “ నో స్టాక్ ” బోర్డులు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా, అనవసరంగా భయాందోళనలకు గురై అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లనే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయి.
డిపోలలో తగినంత ఇంధనం అందుబాటులో ఉన్నప్పటికీ, పౌరులు అనవసరంగా తమ ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి ఎగబడడంతో అది ఒక కృత్రిమ కొరతకు దారితీసింది.
నిన్న పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ నెలకొన్న నేపథ్యంలో, హైదరాబాద్లో ఇంధనం లేదా ఎల్పిజి సిలిండర్ల కొరత లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి. సి. సజ్జనార్ పేర్కొన్నారు.
తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, నగరం అంతటా సరఫరా సజావుగా సాగుతోందని ఆయన X లో పోస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు అనవసరమైన రద్దీకి, అంతరాయానికి దారితీయవచ్చని, కాబట్టి పౌరులు భయాందోళనలకు గురికావద్దని లేదా ఇంధన కేంద్రాలకు ఎగబడవద్దని ఆయన కోరారు.
“సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో హైదరాబాద్ నగర పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతిఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని, వదంతులను వ్యాప్తి చేయడం లేదా నమ్మడం మానుకోవాలని, సాధారణ పరిస్థితులు కొనసాగేలా అధికారులకు సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము,” అని ఆయన అన్నారు.
హైదరాబాద్లో ఇంధన కొరతకు సంబంధించిన వదంతులను తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఖండించింది. ఇంధన కొరత లేదని, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ల వద్ద తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని అది పేర్కొంది. భయాందోళనలతో కొనుగోళ్లు చేయడం వల్ల దేశవ్యాప్తంగా అనేక రిటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా సరుకు నిండుకుంది.
పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాలలో నిల్వ ఉంచుకోవడం పీఈఎస్ఓ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ, నిన్నటి నుండి హైదరాబాద్లోని పెట్రోల్ పంపుల వద్ద భారీ రద్దీ, పొడవైన క్యూలు కొనసాగుతున్నాయి.
