వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం ఇరాన్కు 15-సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించిందని, అయితే ఆ ప్రణాళిక రూపరేఖల గురించి బహిరంగంగా మాట్లాడే అధికారం లేదని పేరు తెలపడానికి ఇష్టపడని వ్యక్తి తెలిపారు.
వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య పునఃచర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చిన పాకిస్థాన్కు చెందిన మధ్యవర్తులు ఈ కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్కు సమర్పించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న సుమారు 50వేల మంది సైనికులకు అదనంగా, 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుండి కనీసం వేయి మంది అదనపు సైనికులను పిలిపించడానికి అమెరికా సైన్యం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన వచ్చింది.
ఈ 15-సూత్రాల ప్రణాళికను ఇరాన్ అధికారులకు అందజేసినట్లు అంతకుముందు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. పెంటగాన్ కూడా రెండు మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్లను మోహరించే ప్రక్రియలో ఉంది, ఇవి ఈ ప్రాంతానికి సుమారు ఐదువేల మంది మెరైన్లను, వేలాది మంది నావికులను అదనంగా చేర్చనున్నాయి.
ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగించాలని ట్రంప్కు సూచిస్తున్న ఇజ్రాయెల్ అధికారులు, అమెరికా ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రణాళికను సమర్పించడంతో ఆశ్చర్యానికి గురయ్యారని ఆ వ్యక్తి మీడియాకు తెలిపారు.
అయితే, మధ్యప్రాచ్యానికి అదనపు సైనికులను, మెరైన్లను పంపడానికి అమెరికా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, తదుపరి ఏమి చేయాలనే దానిపై “వెసులుబాటు” కల్పించుకోవడానికి ట్రంప్ చేస్తున్న ఎత్తుగడగా దీనిని చిత్రీకరిస్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ స్పందించలేదు.
మరోవంక హిజ్బుల్లాపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ రాయబారిని లెబనాన్ బహిష్కరించింది. లెబనాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బీరుట్లోని ఇరాన్ రాయబారిని ఈవారం చివరిలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కాగా, ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలకు స్పష్టమైన సంకేతం. ఇది టెహ్రాన్, దాని మిత్రపక్షమైన మిలిటెంట్ హిజ్బుల్లా గ్రూపు పాత్రపై లెబనాన్లో ఉద్రిక్తతలను పెంచుతోంది.
మార్చి 2న ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య ఇటీవలి యుద్ధం చెలరేగిన తర్వాత, ఇరాన్కు వ్యతిరేకంగా లెబనాన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలలో ఇది తాజాది. ఆ యుద్ధంలో ఇరాన్ దేశ వ్యాప్తంగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడులలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు చెందిన పలువురు సభ్యులు మరణించారు.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా తమ దాడులను ప్రారంభించిన రెండు రోజుల తర్వాత, హిజ్బుల్లా ఇజ్రాయెల్పైకి రాకెట్లను ప్రయోగించి ఈ తాజా యుద్ధానికి కారణమైంది. ఆ దాడులలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో సహా ఇరాన్ ఉన్నతాధికారులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన షియా ముస్లిం మత పెద్దలలో ఒకరైన ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే తాము ఇజ్రాయెల్పై దాడి చేయడానికి గల కారణాలలో ఒకటని హిజ్బుల్లా పేర్కొంది.
కాగా, ఈ వారాంతంలో లెబనాన్ ప్రధాన మంత్రి నవాఫ్ సలాం మాట్లాడుతూ.. లెబనాన్లో హిజ్బుల్లా కార్యకలాపాలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నడిపిస్తోందని, ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించడం ఆ చిన్న దేశాన్ని ఒక పెద్ద ఘర్షణలోకి నెట్టిందని, అందులో లెబనీస్ ప్రభుత్వం “పాల్గొనడానికి సుముఖంగా లేదని” అన్నారు.
“ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం లెబనీయుల కర్తవ్యం కాదని” సలాం అన్నారు. ఈ నెల ప్రారంభంలో లెబనాన్ నుండి మధ్యధరా ద్వీపమైన సైప్రస్ వైపు డ్రోన్లను ప్రయోగించడం వెనుక కూడా ఐఆర్జీ ఉందని సలాం చెప్పారు.
మార్చి 2న హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించి, లెబనాన్లో ఇప్పటివరకు వేయి మందికిపైగా చంపి, దాదాపు మూడువేల మందిని గాయపరిచింది. ఆ తర్వాత, ఇరాన్ మద్దతు ఉన్న ఈ బృందం అన్ని సైనిక కార్యకలాపాలను సలాం ప్రభుత్వం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ బృందం తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించాలని కూడా ఆయన అన్నారు. ఇరాన్ పౌరులకు లెబనాన్లోకి వీసా రహిత ప్రవేశాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
మార్చి ఆరంభంలో జరిగిన అత్యవసర క్యాబినెట్ సమావేశం అనంతరం సలాం మాట్లాడుతూ… యుద్ధం, శాంతి విషయాలపై ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని, లెబనాన్ నుండి క్షిపణులు లేదా డ్రోన్ల ప్రయోగాలను నిరోధించాలని, వాటి ప్రయోగం వెనుక ఉన్నవారిని అదుపులోకి తీసుకోవాలని భద్రతా సంస్థలకు పిలుపునిచ్చారు.
మరోవంక కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రోన్లు ఇంధన ట్యాంక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గల్ఫ్ దేశ పౌర విమానయాన సంస్థ తెలిపింది. ప్రాథమిక సమాచారాన్ని ఉటంకిస్తూ, ఈ దాడి వల్ల “పరిమిత” నష్టం మాత్రమే జరిగిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆన్లైన్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
“సంబంధిత అధికారులు వెంటనే అత్యవసర విధానాలను అమలు చేశారు”. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బందిని మోహరించారని ఏజెన్సీ ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ తెలిపారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో ప్రాంతీయ యుద్ధం మొదలైనప్పటి నుండి కువైట్ విమానాశ్రయంపై అనేకసార్లు దాడులు జరిగాయి.
మార్చి 14న “చాలా డ్రోన్లతో” విమానాశ్రయంపై దాడి జరిగిందని, అవి “దాని రాడార్ వ్యవస్థపై దాడి చేశాయని” పౌర విమానయాన సంస్థ తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మార్చి 8న విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులపై డ్రోన్లు దాడి చేయగా, అంతకుముందు ప్రయాణికుల టెర్మినల్పై జరిగిన దాడిలో పలువురు స్వల్పంగా గాయపడటంతో పాటు కొంత నష్టం కూడా జరిగింది.
