హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. గిరిజన పునరావాస కార్యక్రమాలలో భాగంగా తెలంగాణలోని గిరిజన కుటుంబాల అభివృద్ధికి రూ. 62.55 కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈమేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 14 గిరిజన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. భారతదేశంలో గిరిజనులకు ఒక రాష్ట్ర ప్రభుత్వం అందించిన అత్యధిక పరిహారం ఇదే కావడం విశేషం.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో నివసిస్తున్న నాలుగు గ్రామాల నుండి మొత్తం 417 గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని భట్టి తెలిపారు. కేటాయించిన రూ. 62.55 కోట్లలో, రూ. 24 కోట్లు నగదు పరిహారం కోసం, రూ. 38.55 కోట్లు గృహనిర్మాణం కోసం కేటాయించారు. ఈ కుటుంబాలు సర్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండలపెంట, కొల్లంపెంట గ్రామాలకు చెందినవి.
“ఇది కేవలం ఇళ్ల తరలింపు మాత్రమే కాదు; ఇది జీవితాల పరివర్తన,” అని భట్టి పేర్కొన్నారు. పునరావాసం పొందిన గిరిజనులకు శాశ్వత గృహాలు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు,వ్యవసాయ భూమి లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు.
గిరిజన కుటుంబాలకు రెండు రకాల పునరావాస ప్రాజెక్టులను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు: 160 కుటుంబాలకు రూ. 15 లక్షల నగదు పరిహారం, లేదా 257 కుటుంబాలకు నాగర్కర్నూల్ జిల్లాలోని బచారంలో ఆధునిక వసతులతో కూడిన గృహాలు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి. బచారంలోని పునరావాస కాలనీ రహదారులు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు,రైతు సేవా కేంద్రాలతో సహా అన్ని మౌలిక వసతులు కలిగిన ఒక ‘ఆదర్శ గ్రామం’గా ఉంటుందని భట్టి తెలిపారు.
గిరిజన పిల్లల కోసం ఆధునిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ అభ్యాస వసతులు అందుబాటులోకి తీసుకువస్తామని, అలాగే స్వయం సహాయక సంఘాలు (SHGలు),నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వారి ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

