హైదరాబాద్: తెలంగాణలో విపక్షాలు రాజకీయంగా నిలదొక్కుకోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల నుండి ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపికి చెందిన నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలంటే దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలపై పార్టీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ సర్వే నివేదికలు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నియోజకవర్గాల్లో అంతర్గత తగాదాలు, నాయకత్వ సంక్షోభంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు కొందరు ఇప్పుడు కేసీఆర్పై కన్నేశారు. అధికారికంగా ధృవీకరించనప్పటికీ, టిపిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన టి. జగ్గారెడ్డి, ఇతర నాయకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబందిత వర్గాలు చెబుతున్నాయి. వీరిలో కొందరు తమ నియోజకవర్గంలో కొన్ని పనుల నిమిత్తం ఇటీవల కేటీఆర్ను కలిసినప్పుడు ప్రాథమికంగా ఆయనతో చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లా ఓటర్లను ప్రభావితం చేయగలిగిన మధిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భట్టి విక్రమార్కను కూడా తమ పార్టీలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. కోదాడ, హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ఛార్జ్లుగా ఉన్న టీపీసీసీ మాజీ చీఫ్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణిని చేర్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అలాగే రంగారెడ్డి, పాత కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లను ప్రభావితం చేయగలరని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ సెగ్మెంట్లపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.