న్యూఢిల్లీ: ఫ్రీడం హౌస్ 2026 నివేదిక విడుదలైంది. మొత్తం 195 దేశాలలో స్వేచ్ఛ స్థితిని ఈ రిపోర్టు అంచనా వేసింది. ఈ అధ్యయనం ప్రకారం గత 20 ఏళ్లలో 19 “పాక్షిక స్వేచ్ఛాయుత” దేశాలు “స్వేచ్ఛ లేనివి”గా మారిపోయాయి. ఇక భారతదేశంలోనూ ప్రజాస్వామ్య సూచీలు క్షీణించాయి. మనదేశం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి విలువలను రాజ్యాంగబద్ధంగా పొందుపరుస్తూ బహుళ పార్టీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతున్నప్పటికీ, వివక్షాపూరిత విధానాలు, ముస్లింల వంటి మైనారిటీ సమూహాలపై పెరుగుతున్న వేధింపులు స్వేచ్ఛా దేశంగా భారతదేశ హోదాను ప్రశ్నార్థకం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో పాత్రికేయులు, ఎన్జీఓలు, ప్రభుత్వ విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు గణనీయంగా పెరిగాయని, అదే సమయంలో ముస్లింలు, షెడ్యూల్డ్ తరగతులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడే ఉన్నాయని నివేదిక పేర్కొంది.
కాగా, భారతదేశ ప్రజాస్వామ్య సూచికలలో దీర్ఘకాలికంగా నిరంతర క్షీణత ఉంది. 2005 నుండి 14 పాయింట్ల నష్టాన్ని ఫ్రీడమ్ హౌస్ పేర్కొంది. దేశంలో ఎన్నికలు పోటీతత్వంతో జరుగుతున్నప్పటికీ, శాసన ప్రక్రియలు సాధారణంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పరిగణిస్తున్నప్పటికీ, కార్యనిర్వాహక వర్గం కుతంత్రాలు, చట్టాల అమలు ప్రజాస్వామ్య తిరోగమనాన్ని వేగవంతం చేస్తున్నాయని ఈ అధ్యయనం ఎత్తి చూపుతోంది. ఇది 2020లో భారతదేశం “స్వేచ్ఛా” దేశం హోదాను “పాక్షిక స్వేచ్ఛా” దేశంగా తగ్గించుకోవడానికి, అదే వర్గంలో కొనసాగడానికి దారితీసింది. నిష్పక్షపాతమైన ఎన్నికల విధానాలు, సక్రమమైన ప్రక్రియలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాజకీయ నిర్ణయాలను, భాగస్వామ్యాన్ని ప్రభావితం చేయడానికి గత ఏడాది కాలంగా నిరంతరం విధ్వంసకర చర్యలు తీసుకుంటున్నారు.
2025 బీహార్ ఎన్నికలలో అసెంబ్లీలోని 243 స్థానాలకు గాను 203 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోవడాన్ని, అలాగే భారీ ఎత్తున ఓటర్ల జాబితా అవకతవకలపై ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలను ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. అంతేకాదు బీహార్, మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ముస్లిం,మైనారిటీ ఓటర్ల ఓటు హక్కును హరించడానికి, ఎస్ఐఆర్ను ఉపయోగించడం, జాబితా నుండి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడం వంటి ఎత్తుగడలను వాడుతున్నారన్న ప్రతిపక్ష ఆరోపణలను ఇది నొక్కి చెబుతుంది.
దేశంలో పౌర స్వేచ్ఛలకు సూచికలుగా ఉన్న పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛల స్థితిని ఈ నివేదిక అంచనా వేస్తుంది. పాత్రికేయులపై దాడులు నాటకీయంగా పెరగడం, “దేశద్రోహులు”గా ముద్రపడతామనే భయంతో స్వీయ-సెన్సార్షిప్కు పాల్పడటం వంటి కారణాలతో, ఈ రెండు అంశాలలోనూ భారతదేశం తక్కువ స్కోరు సాధించింది.
పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత వ్యక్తీకరణ స్వేచ్ఛ, న్యాయపరమైన ప్రక్రియలలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుంది. మొత్తంగా ఈ నివేదిక దేశంలోని ప్రజాస్వామ్య సంస్థల బలోపేతం, పౌర హక్కుల పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెబుతోంది.


