టెల్అవీవ్: పాలస్తీనా ఖైదీలకు మరణశిక్ష విధించే కొత్త చట్టాన్ని ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించాక, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా అమెరికా ఇజ్రాయెల్ను విమర్శించడానికి నిరాకరించింది. “ఉగ్రవాదానికి పాల్పడిన వ్యక్తులపై తమ సొంత చట్టాలను, శిక్షలను నిర్ణయించుకునే ఆ దేశ సార్వభౌమ హక్కును అమెరికా గౌరవిస్తుంది” అని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
“అటువంటి చర్య ఏదైనా నిష్పక్షపాత విచారణతో, దానికి సంబంధించిన అన్ని వర్తించే హామీలు, రక్షణలకు అనుగుణంగా అమలవుతుందని మేము విశ్వసిస్తున్నామని” ఆ ప్రతినిధి జోడించారు.
మానవ హక్కుల సంఘాలు, ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ ప్రభుత్వాలతో సహా పలు దేశాలు ఈ చట్టాన్ని వివక్షాపూరితమైనదిగా, అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా ఖండించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ చట్టం పట్ల బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేశాయి. ఈ చర్య “ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించి ఇజ్రాయెల్ కట్టుబాట్లను దెబ్బతీసే” ప్రమాదం ఉందని హెచ్చరించాయి.
ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టం, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ప్రాణాంతక దాడులకు పాల్పడినట్లు రుజువైన పాలస్తీనియన్లకు మరణశిక్షను ప్రామాణిక శిక్షగా నిర్దేశిస్తుంది. 1962లో నాజీ అధికారి అడాల్ఫ్ ఐచ్మాన్ను ఉరితీసినప్పటి నుండి ఇజ్రాయెల్ ఏ న్యాయపరమైన మరణశిక్షను అమలు చేయలేదు.
ఖైదీల హక్కుల సంఘాలు, ఇజ్రాయెల్ జైలు సర్వీస్ ప్రకారం, 350 మంది పిల్లలు, 66 మంది మహిళలతో సహా 9,300 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రస్తుతం ఇజ్రాయెల్ జైళ్లలో నిర్బంధంలో ఉన్నారు. పాలస్తీనియన్, ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థల ప్రకారం, నిర్బంధంలో ఉన్నవారు చిత్రహింసలు, ఆకలి, వైద్య నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నారు, దీనివల్ల డజన్ల కొద్దీ మరణించారు.
అక్టోబర్ 2023 నుండి, గాజాలో తన మారణహోమంతో పాటు, ఇజ్రాయెల్ పాలస్తీనియన్ ఖైదీలపై చర్యలను తీవ్రతరం చేసింది. ఈ మారణహోమంలో 72,000 మందికి పైగా మరణించగా, సుమారు 1,72,000 మంది గాయపడ్డారు.
