టెహ్రాన్: తమ నేతల హత్యలో పాలు పంచుకున్న టెక్ సంస్థలను ఇరాన్ హెచ్చరించింది. నేటి నుండి ఆపిల్, గూగుల్, మెటా, ఐబిఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు.
టెహ్రాన్ కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటల (1630 GMT) నుండి…ఈ కంపెనీల సంబంధిత యూనిట్లు ధ్వంసం చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. “ఈ సంస్థల ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని మేము సలహా ఇస్తున్నామని” కూడా జోడించారు.
ఈ కంపెనీలలో ఆపిల్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబిఎం, డెల్, టెస్లా, ఎన్విడియా, బోయింగ్, హెచ్పి, సిస్కో, ఒరాకిల్, ప్లాంటర్, జె.పి. మోర్గాన్, జిఇ, స్పైర్ సొల్యూషన్స్, జి42 ఉన్నాయి.
ఆ సంస్థలను “ఉగ్రవాద కంపెనీలు”గా ఇరాన్ సైన్యం పేర్కొంది. అంతేకాదు ఆ సంస్థల చుట్టూ నివసిస్తున్న స్థానికులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని కోరారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సంఘర్షణకు ముగింపు పలికే లక్ష్యంతో దౌత్యం నిర్వహిస్తున్నానని చెబుతూనే, ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేస్తానని బెదిరిస్తున్న తరుణంలో ఈ హెచ్చరిక వచ్చింది.
ఇజ్రాయెల్ జరిపిన దాడులకు, అమెరికా ఇంటెలిజెన్స్ అందించిన మద్దతుకు ప్రతీకారంగానే ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి ఇరాన్కు చెందిన సుప్రీం లీడర్తో సహా 250 మందికి పైగా సీనియర్ అధికారులను హతమార్చిందని, దీనికి ఈ టెక్ కంపెనీలు సహకరించాయని ఐఆర్జీసీ ఆరోపిస్తోంది. అందుకే ఈ సంస్థలను ‘చట్టబద్ధమైన లక్ష్యాలు’గా పరిగణిస్తున్నామని తన ప్రకటనలో పేర్కొంది.
ఇరాన్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకున్న కార్యకలాపాలను నిలిపివేయాల్సిన “అవసరం గురించి మేము పదేపదే చేసిన హెచ్చరికలను” అమెరికా ప్రభుత్వం, టెక్ దిగ్గజాలు “విస్మరించాయని” ఇరాన్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ నేతల హత్యలో టెక్ సంస్థలే “ప్రధాన పాత్ర పోషించాయని” ఆరోపించారు.
ఇరాన్ నాయకత్వంలోని మొత్తం శ్రేణిని హతమార్చాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్న తరుణంలో, ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్-ఇన్-చీఫ్ మహమ్మద్ పక్పూర్ హతమయ్యారు. అంతేకాదు ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా అధిపతి అలీ లారిజానీతో పాటు అనేక ఇతర ప్రముఖులు కూడా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు.

