Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

గద్దర్‌ను ‘నక్సల్’ అన్న అమిత్ షా…విమర్శించిన తెలంగాణ కాంగ్రెస్!

Share It:

హైదరాబాద్: దివంగత తెలుగు కవి-విప్లవకారుడు గద్దర్‌ను “నక్సల్” అని అభివర్ణించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, పార్టీ నాయకులు నగరవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

అమిత్‌షా వ్యాఖ్యలు గద్దర్‌ను మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలను కూడా అవమానించడమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.

“గద్దర్ తన జీవితాంతం రైతులు, కార్మిక వర్గాల కోసం పోరాడారు. ఆయన తన పాటల ద్వారా తెలంగాణ కోసం గళం విప్పారు” అని గౌడ్ అన్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దర్‌ను ప్రశంసించారని కూడా ఆయన తెలిపారు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత కవి గౌరవార్థం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఏర్పాటు చేసిందని, అలాగే ఆయన కుమార్తె వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథికి ఛైర్‌పర్సన్‌గా నియమించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ పేర్కొన్నారు.

అమిత్ షా ఏమన్నారంటే
నక్సలిజం నిర్మూలనపై లోక్‌సభలో అమిత్‌ షా ప్రసంగిస్తూ…కాంగ్రెస్ ఎంపీ,ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 2018లో గద్దర్‌తో జరిపిన సమావేశాన్ని ప్రస్తావించారు. నక్సలిజానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని ఆరోపించడానికి షా ఆ సమావేశాన్ని ఉదహరించారు.

ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ నేతృత్వంలో నల్లకుంటలో అమిత్‌ షా దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన చేపట్టారు. ఈ విషయంపై మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తూ, షా తక్షణమే క్షమాపణ చెప్పాలని, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ముదిరాజ్ డిమాండ్ చేశారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయానికి వెళ్లే రహదారికి “గద్దర్ మార్గ్” అని పేరు మార్చాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కోరారు.

కాగా, గుమ్మడి విఠల్ రావుగా జన్మించిన గద్దర్ ఒక కవి, గాయకుడు, కమ్యూనిస్ట్ విప్లవకారుడు. ఆయన 1970వ దశకంలో నక్సలైట్ ఉద్యమం ద్వారా ప్రాముఖ్యత పొంది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రముఖ గళంగా మారారు.

ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగ వ్యవస్థాపక సభ్యుడు మరియు జన నాట్య మండలి వ్యవస్థాపకుడు. 1987 నాటి కారంచేడు మారణకాండపై జాతీయ దృష్టిని ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.