న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్సిఎస్) తెలిపింది. కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానాలలో సంభవించాయి. ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు.
రాత్రి 9.42 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 150 కిలోమీటర్ల లోతులో ఉందని ఎన్సిఎస్ తెలిపింది. ఉత్తరాదిన నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. న్యూఢిల్లీలో పాటు, నోయిడా, చండీగఢ్, పంజాబ్లోని లూథియానా, జమ్మూకశ్మీరలోని పూంచ్ సెక్టర్, శ్రీనగర్, కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. డెహ్రాడూన్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని పలు భవనాల్లోని వారు తెలిపారు.
భూకంపం సమయంలో తమ ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లు, లైట్లు ఊగుతున్న వీడియోలను చాలా మంది సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఎవరికీ గాయాలు కాలేదని ఆశిస్తున్నాను. ఫ్యాన్ ఊగడం చూసి, భూకంపం వచ్చిందని వార్తలు చూశానని” ఒక నెటిజన్ అన్నారు.
చండీగఢ్కు చెందిన బల్దేవ్ చంద్, తనకు బలమైన కుదుపుకు లోనైనట్లు చెప్పారు. పంజాబ్లోని జిరక్పూర్లో ఒక నివాస భవనంలోని 11వ అంతస్తులో నివసిస్తున్న అజయ్ కుమార్ మాట్లాడుతూ… “భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. మేము కిందకు పరుగెత్తాలని అనుకున్నాము, కానీ వెంటనే ప్రకంపనలు ఆగిపోయాయి” అని అన్నారు. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు.

