హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఖండించింది. సిసోడియా అరెస్టు అప్రజాస్వామిక చర్య అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పడం ద్వారా బీజేపీ చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో పార్టీలను బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకునే కుట్రలో భాగమే సిసోడియా అరెస్టు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు చివాట్లు తిన్న తర్వాత ఓటమి భరించలేక సిసోడియాను అరెస్ట్ చేసిందన్నారు.
తమ పార్టీకి చెందిన అవినీతి నాయకులను ‘సత్యహరిశ్చంద్రుని సోదరులు’గా చిత్రీకరించడానికి, ప్రతిపక్ష నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ చేస్తున్న అనైతిక, దుష్ట రాజకీయాలను దేశం గమనిస్తోంది. బీజేపీ కుట్ర రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారు. భవిష్యత్తులో బీజేపీ నేతలకు అదే గతి పడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిన బీజేపీ అప్రజాస్వామిక పార్టీ అని బీఆర్ఎస్ నేత గుర్తుచేశారు. తమ డిమాండ్లను పట్టించుకోని పార్టీలను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోంది. తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని గుర్తు చేశారు.
బీజేపీ కుటిల యత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు కనిపెడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షాలపై బీజేపీ కుట్రలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా మారాయని కేటీఆర్ ఆరోపించారు.