ఖమ్మం: సత్తుపల్లిలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని అధికారులు తెలిపారు.
చంద్రాయపాలెం, రేగల్లపాడు రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లోని పాఠశాలల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధుల సహకారంతో ఈ పనులు జరుగుతున్నాయని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. “పట్టణ ప్రాంతాల్లో లభించే నాణ్యమైన విద్యా వాతావరణాన్ని గిరిజన విద్యార్థులకు అందించడం, మారుమూల ప్రాంతాల్లోని పిల్లలలో చదువు పట్ల మరింత ఆసక్తిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం” అని ఆయన అన్నారు.
ఇందులో భాగంగా, పాఠశాలల్లో ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానెళ్లు, నిరంతర విద్యుత్ సరఫరాతో సహా ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తరగతి గదులకు తెలుపు, నీలం రంగులు వేసి మరింత ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టించారు.
దీంతో పాటు, కొత్త ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు, వైరింగ్, ఫ్యాన్లు, లైటింగ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పనలో భౄగంగా… పాఠశాలలకు కర్టెన్లు,కొత్త బెంచీలను కూడా అందించారు.
మరింత అనుకూలమైన విద్యా వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, ఈ చొరవ గిరిజన విద్యార్థులలో అభ్యసన ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని, డ్రాపౌట్ రేట్లను తగ్గించడంలో సహాయపడుతుందని సింగ్ అన్నారు.
కాగా, ప్రభుత్వ పాఠశాలకు ఆర్థిక సహాయం అందించినందుకు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు జిల్లా అటవీ అధికారి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో, ఈ ప్రాంతంలో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి అటవీ శాఖ చేస్తున్న కృషికి లబ్ధి పొందిన పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.
