తిరువనంతపురం: రెండేళ్ల క్రితం (2024) వయనాడ్లో సంభవించిన ఘోరమైన కొండచరియల విపత్తులో తమ ఇళ్లను కోల్పోయిన 51 కుటుంబాలకు యూడీఎఫ్ ప్రధాన మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఆధ్వర్యంలో చేపట్టిన పునరావాస ప్రాజెక్టు కింద కొత్తగా నిర్మించిన ఇళ్లలోకి ప్రవేశించాయి.
వయనాడ్ జిల్లాలోని ముట్టిల్లో సోమవారం కొత్త ఇళ్ల తాళాలను అప్పగించారు. వివిధ మతాలకు చెందిన కుటుంబాలు తమ తమ సంప్రదాయాల ప్రకారం గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్నారు. ఈ విషాద సమయంలో ఐక్యత, సామరస్యానికి ఇది “నిజమైన కేరళ కథ” అని సోషల్ మీడియాలో చాలామంది ప్రశంసించిన భావోద్వేగ దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
లబ్ధి పొందిన వారిలో 14 కుటుంబాలు హిందూ కుటుంబాలు కూడా ఉండటం గమనార్హం. వారు తమ కొత్త ఇళ్లలో సాంప్రదాయ పూజలు చేసి దీపాలు వెలిగించగా, ఇతర వర్గాల కుటుంబాలు తమ తమ ఆచారాలను పాటించాయి. విభిన్న కుటుంబాలు కలిసి వేడుక చేసుకుంటున్న చిత్రాలు వైరల్ అయ్యాయి, ఇవి దృఢత్వానికి, సామూహిక పునరుద్ధరణకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
“మనస్ఫూర్తిగా నిర్మించిన గృహాలు”
ఈ ప్రాజెక్టును నిజమైన భావోద్వేగంతో, ప్రజా మద్దతుతో నిర్మించారని ఐయూఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ అభివర్ణించారు. “ఇది మేము మా ఇది మేము మనస్ఫూర్తిగా చేపట్టిన ప్రాజెక్టు,” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నాయకుడు పి.కె. కున్హాలికుట్టి సంఘీభావ స్ఫూర్తిని నొక్కిచెప్పారు: “వారు గొప్ప దుఃఖాన్ని అధిగమించి వచ్చారు. ఈ రోజు మనం వారి ఆనందాన్ని చూశాం. ఫర్నిచర్, నిత్యావసరాలు కూడా ప్రజా విరాళాలతోనే అందించాం. మానవత్వంపై ఉన్న విశ్వాసమే దీనిని సాధ్యం చేసిందని ఆయన అన్నారు.”
ప్రతి ఇల్లు ఎనిమిది సెంట్ల భూమిలో, సుమారు 1,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో చక్కగా డిజైన్ చేసిన ఒకే అంతస్తు నిర్మాణం. ఈ గృహాలలో మూడు పడకగదులు, ఒక వంటగది, భోజన ప్రదేశం, పని చేసుకునే స్థలం, కూర్చునే ప్రదేశం, పేవ్డ్ ప్రాంగణం ఉన్నాయి. కుటుంబాలు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా వారికి ఫర్నిచర్, వంట సామాగ్రి,కిరాణా కిట్లు కూడా అందించారు.
ఈ సందర్భంగా ఓ బాధితురాలు రమ్య మాట్లాడుతూ…“కొండచరియలు విరిగిపడటంతో మేము సర్వస్వం కోల్పోయాము. ఈరోజు మేము మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభిస్తున్నాము. ఈ మద్దతుకు మేము కృతజ్ఞులమని సంతోషం వ్యక్తం చేసింది.”
క్రౌడ్ఫండింగ్
ఈ ప్రాజెక్టుకు పూర్తిగా ప్రజల క్రౌడ్ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చారు. ఐయూఎంఎల్ (IUML) సంస్థ మెప్పాడి పంచాయతీలోని వెల్లితోడ్లో 11.5 ఎకరాల భూమిని ₹14.13 కోట్లకు కొనుగోలు చేసింది. మొదటి దశలో ఈ 51 ఇళ్లు ఉన్నాయి, మిగిలిన 54 ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి అవుతుందని అంచనా. పారదర్శకమైన లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపులు జరిగాయి.
178 కుటుంబాల కోసం కేరళ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పునరావాస ప్రాజెక్టు ఆలస్యం కాగా, బలమైన సామాజిక భాగస్వామ్యం, విరాళాల కారణంగా ఐయూఎంఎల్ (IUML) చేపట్టిక ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగింది.
బాధితులకు, ఈ ఇళ్లు కేవలం ఆశ్రయం కన్నా ఎక్కువే — ఊహించలేని నష్టం తర్వాత అవి గౌరవానికి, ఆశకు, పునరుద్ధరించిన జీవితానికి చిహ్నాలుగా నిలుస్తాయి. విపత్తు అనంతరం సామూహిక సద్భావన, తక్షణ చర్యలు ఎలా స్వస్థతను చేకూర్చగలవో ఐయూఎంఎల్ చేపట్టిన ఈ ప్రాజెక్టు నొక్కి చెబుతోంది.
