హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఆదిలాబాద్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండో దశను ప్రారంభించనున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మే 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రెండో దశకు సంబంధించిన విధివిధానాలపై చర్చించి ఖరారు చేస్తామని ఆయన తెలిపారు.
హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రెవెన్యూ, గృహ నిర్మాణ సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా అనువైన భూములను గుర్తించి, లబ్ధిదారుల ప్రస్తుత నివాసాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు, మురికివాడలు, భూదాన్ భూములు, గత పథకాల కింద నిర్మించిన శిథిలావస్థలో ఉన్న గృహ సముదాయాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ భూముల ఆక్రమణను ప్రభుత్వం సహించదని పేర్కొంటూ, అక్రమ భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

