Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

భారతీయ ముస్లింలు: సంక్షోభంలో సాకారం కావాల్సిన అవకాశం!

Share It:

డాక్టర్ ఖుతుబుద్దీన్…🖋️

భారతదేశంలోని ముస్లింలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన, అనిశ్చితమైన దశను ఎదుర్కొంటున్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో (ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలలో) జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వారిలో ఆందోళన, అభద్రతా భావం మరింత పెరిగాయి. తాము రాజకీయంగా ఒంటరైపోతున్నామని, సామాజికంగా అభద్రతకు గురవుతున్నామని, ఆర్థికంగా వెనుకబడిపోతున్నామని చాలామంది ముస్లింలు భావిస్తున్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు, మూక దాడులు (మాబ్ వయొలెన్స్), వివక్ష , ‘బుల్డోజర్ రాజకీయాలు’ వంటి సంఘటనలు సామాన్య ముస్లింలలో తీవ్ర భయాందోళనలను సృష్టించాయి.

ఇదే సమయంలో, సమర్థవంతమైన నాయకత్వ లోపం, దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి.అయితే, ప్రతి సంక్షోభంలోనూ ఒక అవకాశం దాగి ఉంటుందని చరిత్ర మనకు నేర్పుతుంది. కష్టకాలం అనేది సమాజాలు తమను తాము ఆత్మపరిశీలన చేసుకోవడానికి, పునర్వ్యవస్థీకరించుకోవడానికి, మరింత పట్టుదలతో, వివేకంతో పునర్నిర్మించుకోవడానికి తోడ్పడుతుంది.

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోని ముస్లింల పరిస్థితి తీవ్రంగా ఆలోచించదగ్గది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 4.5 కోట్లకు (45 మిలియన్లు) పైగా ముస్లిం జనాభా ఉంది. వీరిలో దాదాపు 3 కోట్ల మంది పశ్చిమ బెంగాల్‌లో, సుమారు 1.5 కోట్ల మంది అస్సాంలో నివసిస్తున్నారు. ఇంత భారీ జనాభా ఉన్నప్పటికీ… విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపార యాజమాన్యం, సంస్థాగత ప్రాతినిధ్యం వంటి రంగాలలో ఈ రాష్ట్రాల్లోని ముస్లింలు దేశంలోనే అత్యంత వెనుకబడిన వర్గాలుగా మిగిలిపోయారు. అనేక సామాజిక-ఆర్థిక సూచికలలో (indicators), వారు దళితులు, చారిత్రకంగా వెనుకబడిన ఇతర వర్గాల కంటే కూడా వెనుకబడి ఉన్నారు. ముస్లింలలోని మెజారిటీ విభాగం ఇప్పటికీ పేదరికం, నిరక్షరాస్యత, రాజకీయ అవగాహన లోపం, ఆధునిక విద్య అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో పోరాడుతూనే ఉంది.

ప్రస్తుత తరుణంలో ధైర్యం, స్థితిస్థాపకత (resilience – తట్టుకునే శక్తి), పట్టుదల ఎంతైనా అవసరం. భయం ఎన్నటికీ భవిష్యత్తును నిర్మించలేదు. ఒక సమాజం ఆత్మగౌరవంతో, స్వేచ్ఛతో జీవించాలనుకుంటే, అది వివేకంతో, సమిష్టిగా ఎలా పోరాడాలో నేర్చుకోవాలి. “జీనా హై తో లడ్నా సీఖో” (జీవించాలనుకుంటే, పోరాడటం నేర్చుకోండి) అనే సామెత ఇక్కడ ఎంతో సందర్భోచితం.గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే: ఈ పోరాటం అంటే హింస లేదా ఘర్షణ కాదు. దీని అర్థం అజ్ఞానాన్ని విద్యతో, పేదరికాన్ని వ్యవస్థాపకతతో (వ్యాపార నైపుణ్యంతో), ద్వేషాన్ని ఓర్పుతో, బలహీనతను వ్యవస్థీకృత శక్తితో ఎదిరించడం. ఆత్మగౌరవంతో దృఢంగా నిలబడటం, మానసికంగా లొంగిపోవడానికి నిరాకరించడమే నిజమైన పోరాటం.

ఆధునిక రాజకీయం, సమాజం నుండి ముస్లింలు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవాలి: ఇతరుల చేతుల్లో సులభంగా మోసపోయే బాధితులుగా (victims) మిగిలిపోకూడదు. అవగాహన లేని సమాజాలు తరచుగా భావోద్వేగ నినాదాలు, విభజన ప్రచారాలు, స్వల్పకాలిక వాగ్దానాల వలలో చిక్కుకుని మోసపోతుంటాయి. అందువల్ల, ముస్లిం సమాజానికి నేడు మేధోపరమైన సాధికారత, వ్యూహాత్మక ఆలోచన ఎంతో అవసరం. విద్య అత్యంత ప్రాధాన్యత అంశంగా మారాలి. అది కేవలం మతపరమైన విద్యకే పరిమితం కాకూడదు; ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక, చట్టపరమైన, రాజకీయ విజ్ఞానాన్ని కూడా అందుకోవాలి. బలమైన విద్యా పునాది ఒకటి లేదా రెండు తరాల లోపల ఏ సమాజం యొక్క తలరాతనైనా మార్చగలదు.ప్రతి ఓటమికి లేదా వైఫల్యానికి ఇతరులను నిందించడం ఈ సమాజం ఇకనైనా స్వస్తి పలకాలి. వివక్ష, అన్యాయం అనేవి నిజమైన సమస్యలే అయినప్పటికీ, వాటితో పాటు ఆత్మవిమర్శ కూడా అంతే అవసరం. అంతర్గత సంస్కరణలు, జవాబుదారీతనం లేకుండా ఏ సమాజమూ పురోగమించలేదు. ముస్లింలు క్రమశిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యం (professionalism), ఆర్థిక ప్రణాళిక, దీర్ఘకాలిక దార్శనికతను పెంపొందించుకోవాలి. ప్రజాస్వామ్య సంస్థలు, పౌర సమాజం (civil society), మీడియా, న్యాయవ్యవస్థ, విద్యా రంగం (academia), వ్యాపార రంగాలలో వారు మరింత చురుకుగా పాలుపంచుకోవాలి. అభద్రతా భావానికి వ్యతిరేకంగా ఆర్థిక స్వాతంత్ర్యం, విద్యా రంగంలో ప్రతిభ అనేవి అత్యంత బలమైన రక్షణ కవచాలుగా నిలుస్తాయి.

ఈ కీలక తరుణంలో, గొప్ప కవి-తత్వవేత్త అల్లామా ముహమ్మద్ ఇక్బాల్ ఇచ్చిన సలహా ఎంతో ఆచరణీయం:“అఫ్రాద్ కే హాథోన్ మే హై అక్వామ్ కీ తక్దీర్,హర్ ఫర్ద్ హై మిల్లత్ కే ముఖద్దర్ కా సితారా.”(దేశాల తలరాతలు వ్యక్తుల చేతుల్లోనే ఉంటాయి; సమాజం యొక్క భాగ్య రేఖలో ప్రతి ఒక్కరూ ఒక నక్షత్రం లాంటివారే.)ఒక సమాజం యొక్క సమిష్టి తలరాతను కేవలం ప్రభుత్వాలు లేదా బాహ్య పరిస్థితులు మాత్రమే శాసించలేవు; ఆ సమాజంలోని వ్యక్తుల ఆలోచనలు, క్రమశిక్షణ, పట్టుదల మాత్రమే దానిని నిర్దేశిస్తాయని ఈ సందేశం గుర్తుచేస్తోంది.కాబట్టి, నిరాశకు లోనై లొంగిపోవడానికి బదులుగా, ఈ సంక్షోభాన్ని ఒక మలుపుగా (turning point) మార్చుకోవాలని ముస్లింలు గ్రహించాలి. ప్రతికూల పరిస్థితులు కొన్నిసార్లు అద్భుతమైన సానుకూల మార్పులకు దారితీస్తాయి. కష్టాలు తరచుగా సమాజాలను అలసత్వం నుండి మేల్కొలిపి, తప్పులను సరిదిద్దుకునేలా చేస్తాయి. నిజాయితీతో కూడిన ఆత్మపరిశీలనకు ఇదే సరైన సమయం.బలహీనమైన విద్యా పునాదులు, భావోద్వేగ రాజకీయాలు, ఆర్థిక ప్రణాళిక లోపం, అంతర్గత విభేదాలు, సమస్యల పరిష్కారం కోసం ఇతరులపై ఆధారపడటం… వంటి తమ వెనుకబాటుతనానికి గల అసలైన అంతర్గత కారణాలను ఈ సమాజం గుర్తించి, సరిదిద్దుకోవలసి ఉంది.

అనువాదం: ముహమ్మద్ ముజాహిద్

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.