హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్సి) నుంచి రూ.13,600 కోట్ల విలువైన వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందింది.
ఈమేరకు ఢిల్లీలో ఐఆర్ఎఫ్సి, లార్సెన్ & టూబ్రో మెట్రో రైల్ (ఎల్&టి హైదరాబాద్), హెచ్ఎంఆర్ఎల్ మధ్య ఈ రుణ ఒప్పందం కుదిరింది. త్రైమాసిక వాయిదాలతో దీనిని 20 ఏళ్ల రుణంగా రూపొందించారు. అధిక వడ్డీ రుణాల స్థానంలో తక్కువ ఖర్చుతో కూడిన, దీర్ఘకాలిక రూపాయి ఆధారిత రుణాన్ని పొందడానికి సహాయపడుతుంది.
ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, ఇది ప్రస్తుత రుణ భారాన్ని తగ్గించడమే కాకుండా, భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలను కూడా సులభతరం చేస్తుందని అన్నారు.
భారీగా కేటాయించిన రూ. 13,600 కోట్ల మొత్తాన్ని, నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్తో సహా ఇప్పటికే ఉన్న రుణ బాధ్యతలను తీర్చడానికి వినియోగించనున్నారు. ఈ చొరవ ద్వారా, ప్రస్తుత రుణదాతలు తమ రుణాల నుండి క్రమబద్ధంగా నిష్క్రమిస్తారు, అదే సమయంలో ప్రాజెక్ట్ ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడనుంది.
రాష్ట్ర ప్రభుత్వం నుండి షరతులు లేని చెల్లింపు హామీ, అలాగే ఆర్బిఐ మద్దతుతో కూడిన డైరెక్ట్ డెబిట్ ఆదేశంతో సహా, ఒక పటిష్టమైన క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫ్రేమ్వర్క్ ఈ రీఫైనాన్సింగ్ లావాదేవీకి అండగా నిలుస్తోంది.
ఇది హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్ట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను బలోపేతం చేయడమే కాకుండా, కొత్త కారిడార్ల అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, లాస్ట్-మైల్ కనెక్టివిటీని పెంపొందించడం వంటి విస్తరణ ప్రణాళికలను కూడా వేగవంతం చేస్తుంది.
మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మేర విస్తరించి, 57 స్టేషన్లు ఉన్న ఫేజ్ 1 ప్రాజెక్ట్, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) నమూనా కింద అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టులలో ఒకటి. ప్రస్తుతం, ఈ నెట్వర్క్ ప్రతిరోజూ 5 లక్షల మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
