న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, 30 రోజుల పెరోల్ మంజూరు కావడంతో నిన్న రోహ్తక్లోని సునారియా జైలు నుండి బయటకు వచ్చారు. ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో, ఈ స్వయం ప్రకటిత దైవగురువు ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2017లో దోషిగా నిర్ధారణ అయినప్పటి నుండి, పెరోల్పై ఆయన విడుదల కావడం ఇది 16వ సారి కావడం గమనార్హం.
డేరా ప్రతినిధి, న్యాయవాది జితేందర్ ఖురానా తెలిపిన వివరాల ప్రకారం… రామ్ రహీమ్ తన పెరోల్ కాలాన్ని సిర్సాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో గడపనున్నారు. ఆయనకు తరచుగా లభిస్తున్న ఈ పెరోల్పై వివిధ వర్గాల నుండి, ముఖ్యంగా సిక్కు సంస్థల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డేరా అధిపతికి తరచుగా పెరోల్ మంజూరు చేయడాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) పలుమార్లు తీవ్రంగా ఖండించింది.
ఈ ఏడాది జనవరిలో ఇదే తరహాలో 30 రోజుల పెరోల్ మంజూరైన కేవలం కొన్ని నెలలకే, తాజాగా మరో పెరోల్ లభించడం గమనార్హం. అంతకుముందు, ఆగస్టు 2025లో 40 రోజుల పెరోల్, ఏప్రిల్ 2025లో 21 రోజులు, అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరి 2025లో మరో 30 రోజుల పెరోల్ ఆయనకు లభించాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, అక్టోబర్ 2024లో కూడా ఆయన 20 రోజుల పెరోల్పై బయటకు వచ్చారు. పంజాబ్, హర్యానాలో జరిగే కీలక ఎన్నికల సమయాలకు అనుగుణంగా, 2024, 2022 సంవత్సరాల్లో ఆయన పలుమార్లు తాత్కాలికంగా విడుదల అయ్యారు.
కాగా, జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్యకు సంబంధించిన 2002 నాటి కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు మార్చి నెలలో రామ్ రహీమ్ను నిర్దోషిగా విడుదల చేసింది. మే 2024లో, డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్, మరో నలుగురి హత్య కేసులో ఆయనకు పడిన శిక్షను కూడా ఆ న్యాయస్థానం రద్దు చేసింది.
సిర్సా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న డేరా సచ్చా సౌదా సంస్థకు హర్యానా, పంజాబ్, రాజస్థాన్,ఇతర రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారు. హర్యానా రాష్ట్రంలో సిర్సా, ఫతేహాబాద్, కురుక్షేత్ర, కైథల్, హిసార్ వంటి జిల్లాల్లో ఈ సంస్థకు బలమైన ఉనికి ఉంది. పదేపదే మంజూరవుతున్న పెరోల్స్, ప్రాంతీయ రాజకీయాల్లో డేరా ప్రభావంపైనా, నేర న్యాయ వ్యవస్థలో ఉండే నిలకడపైనా చర్చకు దారితీశాయి.

