ఇంఫాల్: మణిపూర్లో జాతి ఘర్షణలు మొదలైనప్పటి (మే 2023లో) నుండి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహాయ శిబిరాలు, తాత్కాలిక గృహాల్లో (prefabricated housing) నివసిస్తున్న కనీసం 731 మంది నిర్వాసితులు (IDPs) మరణించారని ‘సమాచార హక్కు చట్టం’ (RTI) కింద రాష్ట్ర హోం శాఖ వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది.
‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రారంభంలో ఒక అప్పీల్ కేసులో మణిపూర్ సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు, రచయిత,రాజకీయ కార్యకర్త అయిన హరేశ్వర్ గోస్వామికి ఈ సమాచారం అందించారు.
మైతేయి, కుకీ-జో వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన తర్వాత ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు, తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న నిర్వాసితులలో ఈ మరణాలు సంభవించినట్లు హోం శాఖ సేకరించిన జిల్లా-వారీ గణాంకాలు సూచిస్తున్నాయి.
చురాచంద్పూర్లో అత్యధికంగా 248 మరణాలు నమోదయ్యాయి; ఆ తర్వాతి స్థానాల్లో బిష్ణుపూర్ (151), కాంగ్పోక్పి (128), ఇంఫాల్ వెస్ట్ (94), కాక్చింగ్ (60), ఇంఫాల్ ఈస్ట్ (25), జిరిబామ్ (13), తౌబాల్ (11) మరియు టెంగ్నౌపాల్ (1) ఉన్నాయి.
ఇంకా 43,000 మందికి పైగా నిర్వాసితులు
హింస మొదలై దాదాపు మూడేళ్లు గడుస్తున్నా, ఏప్రిల్ 30 నాటికి 43,000 మందికి పైగా ప్రజలు ఇంకా నిర్వాసితులుగానే ఉన్నారని RTI సమాధానం వెల్లడించింది. కాంగ్పోక్పిలో అత్యధికంగా 15,694 మంది నిర్వాసితులు ఉండగా, బిష్ణుపూర్లో 10,092 మంది, చురాచంద్పూర్లో 6,365 మంది ఉన్నారు.
సహాయ శిబిరాలు, నివాసాల్లో 25 అసాధారణ మరణాలు (unnatural deaths) సంభవించినట్లు కూడా ఈ సమాచారంలో పేర్కొన్నారు.
చురాచంద్పూర్లో అధికారులు అటువంటి ఆరు మరణాలను పేర్కొన్నారు. వీటిలో నీట మునిగి చనిపోయిన నాలుగు ఘటనలు, విద్యుదాఘాతం (కరెంట్ షాక్) వల్ల ఒక మరణం, నిందితుడిని అరెస్టు చేసిన ఒక లైంగిక దాడి ఘటన ఉన్నాయి. ఈ ఘటనల తర్వాత కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఇంఫాల్ వెస్ట్లో నాలుగు అసాధారణ మరణాలు నమోదయ్యాయి; వీటిలో రెండు ఉరివేసుకోవడం, ఒకటి మందుల మోతాదు మించిపోవడం (overdose), ఒకటి బుల్లెట్ గాయం వల్ల సంభవించిన మరణం ఉన్నాయి.
ఆరోగ్య సమస్యలు కొనసాగుతున్నాయి
నిర్వాసిత కుటుంబాలలో ఆరోగ్యపరమైన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని కూడా ఆర్టీఐ పత్రాలు ఎత్తిచూపాయి. ఇంఫాల్ తూర్పు శిబిరంలో 217 మంది నివాసితులు ప్రాణాంతక లేదా నయంకాని వ్యాధులతో బాధపడుతున్నట్లు నివేదించగా, ఇంఫాల్ పశ్చిమ శిబిరంలో 41 మంది, బిష్ణుపూర్లో 26 మంది ఇలాంటి రోగులు ఉన్నట్లు తెలిసింది.
కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నేపథ్యంలో 2023 మే 3న మణిపూర్లో హింస ప్రారంభమైంది. ఇది మైతేయ్, కుకీ-జో వర్గాల మధ్య విస్తృత ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణల్లో 250 మందికి పైగా మరణించగా, పదుల వేల మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
రాష్ట్రం జాతి ప్రాతిపదికన విభజనకు గురైంది. కొనసాగుతున్న భద్రతాపరమైన ఆందోళనలు, శాశ్వత రాజకీయ పరిష్కారం లేకపోవడం వల్ల అనేక నిరాశ్రయ కుటుంబాలు తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లలేకపోతున్నాయి. హింస ప్రారంభ దశలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి ఆశ్రయం కల్పిస్తూనే ఉన్నాయి.

