హైదరాబాద్: తెలంగాణ ఓటర్ రైట్స్ ఫోరమ్ (TVRF)కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, సామాజిక కార్యకర్తలు, ప్రొఫెసర్లతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం నిన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డిని కలిసి ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియపై సమగ్ర విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది.
కాగా, తెలంగాణలో జూన్ 25న SIR ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణకు సంబంధించిన ఫారమ్లను పంపిణీ చేయడం, సేకరించడం వంటి పనులు చేపడతారు.
ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఈ బృందం, అసంబద్ధ కారణాలతో ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని హెచ్చరించింది. గరిష్ట పారదర్శకత, విస్తృత ప్రజా అవగాహన, పరిశీలనకు తగినంత సమయం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని వారు రెడ్డిని కోరారు. అలాగే దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వలస కార్మికులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు, విద్యార్థులు, సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే SIR ప్రక్రియ జరుగుతోందని, వారి విజ్ఞాపనను పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి వారికి హామీ ఇచ్చారు.
BLOలకు పోలీసు భద్రత కల్పించండి
క్షేత్రస్థాయి తనిఖీల సమయంలో BLOలకు తగిన భద్రత కల్పించాలని సి. సుదర్శన్ రెడ్డి తెలంగాణ పోలీసులను కోరారు. ఈమేరకు అదనపు CEO డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి (DEO) ఆర్.వి. కర్ణన్, అలాగే జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల,పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల అధికారులు BLOలు, సూపర్వైజర్ల పేర్లు, సంప్రదింపు వివరాలను సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో (SHOs) పంచుకోవాలి; అలాగే SHOలు కూడా తమ వివరాలను వారితో పంచుకోవాలి.
జిల్లా ఎన్నికల అధికారులు తమ పరిధిలోని సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, సంబంధిత పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయాలి. SIR ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ సమావేశాలు రెండు శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
