న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇటీవల అమెరికా చేసిన ప్రకటనలపై ప్రభుత్వం స్పందించిన తీరును లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై విరుచుకుపడ్డారు.
ప్రధాని భారతదేశ ప్రయోజనాలను కాపాడటానికి బదులుగా, ‘ఒక విధేయ సేవకుడిలా’ వింటూ, బయటి ఆదేశాలను పాటిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని ‘రాజీపడ్డారని’ రాహుల్ గాంధీ అన్నారు.
భారత నావికుల మృతి తర్వాత అమెరికా నుండి ‘విచారం గానీ, క్షమాపణ గానీ’ లేవని, దానికి బదులుగా ‘ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారని’ రాహుల్ గాంధీ Xలో రాశారు. హర్ముజ్ జలసంధిలో పనిచేస్తున్న అమెరికా దళాల ఆదేశాలను వాణిజ్య నౌకలు తక్షణమే పాటించాలని, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నట్లుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు.
“అమెరికా సైనిక ఆదేశాలను తక్షణమే పాటించండి. ఎలాంటి ఉల్లంఘనను సహించబోము,” అని అమెరికా కమ్యూనికేషన్ ధోరణిని ఉటంకిస్తూ, ఒక సార్వభౌమ దేశానికి ఇది ఆమోదయోగ్యం కాదని రాహుల్ గాంధీ అన్నారు.
ఒమన్ తీరంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక చర్యలలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని భారత్ నిరసించిన తర్వాత, పెరుగుతున్న దౌత్యపరమైన ఘర్షణల మధ్య ఈ వివాదం తలెత్తింది. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యను “సమర్థించలేమని” పేర్కొంటూ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే భారతదేశం తరుపున అభ్యంతరాన్ని తెలియజేశారు. అలాగే, అధికారికంగా నిరసన తెలియజేయడానికి అమెరికా దౌత్య ప్రతినిధులను పిలిపించారు.
అయితే, ఈ ప్రాంతంలో ఆంక్షలను అమలు చేయడానికి, ఇరాన్ చమురు రవాణాను అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా, తమ బలగాలు జారీ చేసిన సూచనలను అన్ని నౌకలు తప్పనిసరిగా పాటించాలని అమెరికా వాదిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై స్పష్టత కోరుతూనే, జైశంకర్, రూబియోల మధ్య ప్రత్యక్ష సంభాషణతో సహా పలు స్థాయిలలో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని లేవనెత్తింది.
ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో ఇప్పటికే సున్నితంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మరింత ఒత్తిడిని పెంచాయి. ఈ ప్రాంతంలోని విస్తృత వ్యూహాత్మక పోటీలో సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.


