వాషింగ్టన్: ఇరాన్పై దాడులు రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని, మరింత తీవ్రతరం అవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. చర్చల కోసం ఇరాన్ ముందుకు రాకపోతే, వచ్చే వారం ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా దాడులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
“మేము ఇరాన్పై భారీగా దాడులు చేస్తున్నాము. తీరప్రాంతంలో లేదా జలమార్గం వెంబడి వారికి ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మేము లక్ష్యంగా చేసుకుంటున్నాము… ‘ఇక చాలు’ అని నేను చెప్పే వరకు ఈ దాడులు కొనసాగుతాయి,” అని ట్రంప్ ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంధన సంబంధిత లక్ష్యాలపై దాడి చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా…”ఇంధన లక్ష్యాలపై దాడి అనేది మా లాస్ట్ ఆప్షన్, కానీ చివరికి మేము వాటిని కూడా లక్ష్యంగా చేసుకుంటాము.”
“ఈ రాత్రి మేము వారిపై భారీ దాడి చేయబోతున్నాము. రేపు రాత్రి కూడా గట్టిగా దాడి చేస్తాము. ఆ మరుసటి రాత్రి కూడా అలాగే చేస్తాము. ఆ తర్వాత వచ్చే వారం వారికి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది, ఎందుకంటే వచ్చే వారం విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంతు వస్తుంది. వారు చర్చలకు ముందుకు రాకపోతే, మేము వారి విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలను ధ్వంసం చేస్తాము,” అని ఆయన జోడించారు.
అంతకుముందు ఆ రోజు, హార్ముజ్ జలసంధి గుండా రవాణా అయ్యే సరుకులపై 20 శాతం రుసుము వసూలు చేసే ఆలోచనను ట్రంప్ విరమించుకున్నారు; దానికి బదులుగా గల్ఫ్ దేశాలతో వాణిజ్య,పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యూహాత్మక జలమార్గానికి రక్షణ కల్పించినందుకు 20 శాతం రుసుము వసూలు చేయాలని ప్రతిపాదించిన మరుసటి రోజే ఈ ప్రణాళిక మార్పు చోటుచేసుకుంది.
“మధ్యప్రాచ్య దేశాల నాయకత్వంతో జరిపిన అత్యంత ఫలప్రదమైన చర్చల ఆధారంగా, 20 శాతం అమెరికా రీయింబర్స్మెంట్ రుసుము (ఖర్చుల భర్తీ రుసుము) స్థానంలో, వివిధ గల్ఫ్ దేశాలు అమెరికాతో కుదుర్చుకునే వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నాను,” అని ఆయన తన ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు.
గల్ఫ్ దేశాల నుండి ఎటువంటి నిర్దిష్ట హామీలు లభించాయనే విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు; కేవలం “పెట్టుబడులు భారీగా ఉంటాయి, అదే సమయంలో వారి భవిష్యత్తుకు అవి అద్భుతంగా ఉపయోగపడతాయి” అని మాత్రమే పేర్కొన్నారు. ఒప్పందం కుదుర్చుకోవడం తప్ప ఇరాన్కు వేరే మార్గం లేదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూకు గంట ముందు కూడా అమెరికా ప్రతినిధులు ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. “వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు… వారు ఒప్పందం చేసుకోవడం మంచిది. లేకపోతే వారికి ఎవరూ మిగలరు,” అని ట్రంప్ అన్నారు.


