టెహ్రాన్: ఒకవేళ అమెరికా గనుక తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే, ప్రతిగా గల్ఫ్ దేశాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ‘బ్లాక్ అవుట్’ (చీకట్లోకి నెట్టేస్తాం) చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్పై భారీ దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపుల నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. అయితే, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ల అభ్యర్థనలు, చర్చల్లో పురోగతి సాధిస్తామనే ఆశను ఉటంకిస్తూ వారాంతంలో ఆయన ఆ బెదిరింపుల నుండి వెనక్కి తగ్గారు.
“ట్రంప్ తమ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తే, గల్ఫ్లోని దేశాలన్నింటిలోనూ విద్యుత్ను నిలిపివేస్తామని ఇరాన్ బెదిరించింది,” అని ఒక గల్ఫ్ అధికారి ఏఎఫ్పీకి తెలిపారు. ఈ సందేశాన్ని మరో ప్రాంతీయ అధికారి కూడా ధృవీకరించారు.సున్నితమైన విషయాలను చర్చించడానికి, ఇద్దరూ తమ పేర్లు వెల్లడించకుండా మాట్లాడారు.
తాను పదేపదే బెదిరించినట్లుగానే, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయాలని ఆయన యోచిస్తున్నట్లు అమెరికా మీడియా నివేదించగా, ఈ ప్రణాళికాబద్ధమైన దాడులు “రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే అతిపెద్ద దాడి” అవుతాయని ట్రంప్ అన్నారు. తమ విద్యుత్ ప్లాంట్లపై ఏవైనా దాడులు జరిగితే, గల్ఫ్లోని అవే లక్ష్యాలపై దాడులు జరుగుతాయని ఇరాన్ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిందని అధికారులు తెలిపారు. ఇదివరకే బహిరంగంగా ఇలాంటి బెదిరింపులు చేసినప్పటికీ, ఇది “చాలా తీవ్రమైనది” అని గల్ఫ్ అధికారి అన్నారు. ఇందులో “తాము దాడి చేయబోయే లక్ష్యాల సుదీర్ఘ జాబితా” కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.
జూలై మధ్యలో, హోర్ముజ్ జలసంధిలో నౌకాయానంపై జరిగే ప్రతి దాడికి బదులుగా… ఇరాన్ వంతెనలు , విద్యుత్ ప్లాంట్ను ధ్వంసం చేస్తామని ట్రంప్ బెదిరించగా, “కంటికి కన్ను” అనే ప్రతిస్పందన ఉంటుందని టెహ్రాన్ హెచ్చరించింది. మధ్యప్రాచ్య యుద్ధంలో ఇరాన్ దాడుల భారాన్ని గల్ఫ్ ప్రాంతాలు ఎక్కువగా మోసాయి. ఈ దాడులు అమెరికా ఆస్తులతో పాటు పౌర మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. వీటిలో ఇంధన కేంద్రాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు ఉన్నాయి.
ఏప్రిల్, జూన్లలో వరుసగా కాల్పుల విరమణ, తదనంతర అవగాహన ఒప్పందం కుదిరిన తర్వాత కూడా అడపాదడపా దాడులు కొనసాగాయి. కానీ జూలైలో కాల్పుల విరమణ విఫలమవడంతో, ప్రధానంగా కువైట్, బహ్రెయిన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.

