హైదరాబాద్: నగరంలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ- ఇఫ్లూ క్యాంపస్లో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఘర్షణ అనంతరం, ఏబీవీపీకి చెందిన ఏడుగురు సభ్యులను జ్యుడిషియల్ కస్టడీకి, ఎన్ఎస్యూఐకి చెందిన ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయమై ఓయూ సిటీ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ… ఇద్దరు ఎన్ఎస్యూఐ సభ్యులు తీవ్రంగా గాయపడటంతో, ఏబీవీపీ సభ్యులపై పలు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు చెప్పారు.
మరోవైపు, ఏడుగురు ఎన్ఎస్యూఐ సభ్యులపై సాధారణ గాయాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
కాగా తమ సభ్యులందరినీ తక్షణమే విడుదల చేయాలని, ఈ దాడిపై విచారణ జరపాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
ఏబీవీపీ-ఎన్ఎస్యూఐ ఘర్షణ
ఆగస్టు 14 తెల్లవారుజామున ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో విద్యార్థులు గాయపడటంతో పాటు, ఇరువైపులా ఎఫ్ఐఆర్లు (FIRలు) కూడా నమోదయ్యాయి.
దానికి ఒక రోజు ముందు, ఒక విద్యార్థిని తన స్నేహితురాలితో హాస్టల్ గదిని పంచుకోవడానికి అనుమతించకపోవడం, ఇతర సమస్యలపై ఏబీవీపీ మహ్లాక్ బాయి చందా (ఎంబీసీహెచ్) మహిళల హాస్టల్ వద్ద నిరసన చేపట్టింది.
స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సోను రాజ్ సహా ఎన్ఎస్యూఐ సభ్యులు కూడా ఈ నిరసన ప్రదర్శనకు వెళ్లారు. అయితే, ఏబీవీపీ సభ్యులు వారిపై దాడి చేసి, కుల దూషణలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించారు. .
శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పురుషుల హాస్టల్లో ఎన్ఎస్యూఐ సమావేశం జరుగుతుండగా, ఏబీవీపీ సభ్యులు రాడ్లు, బీర్ బాటిళ్లతో లోపలికి వచ్చి ఎన్ఎస్యూఐ సభ్యులపై దాడి చేశారు. అనంతరం ఎన్ఎస్యూఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏబీవీపీకి అనుబంధంగా ఉన్న ఒక ద్వితీయ సంవత్సరం విద్యార్థి హాస్టల్ గదిలోకి 20 మంది ఎన్ఎస్యూఐ సభ్యులు బలవంతంగా చొరబడి అతనిపై దాడి చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ కూడా ఎదురు ఫిర్యాదు చేసింది.


