హైదరాబాద్: మీడియాలో ఏర్పడ్డ నైతిక సంక్షోభంపై చర్చించేందుకు, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే మార్గాలను రూపొందించేందుకు,హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో సీనియర్ పాత్రికేయులు, ఫ్యాక్ట్-చెకర్లు, డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్లకు చెందిన జర్నలిస్ట్ ప్రముఖులు సమావేశమయ్యారు. మీడియాపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడం, దాని స్వేచ్ఛ, స్వాతంత్య్రానికి పెరుగుతున్న ముప్పును అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రెస్క్లబ్లు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రాజకీయాలు-జర్నలిజం విడదీయలేని రంగాలుగా మారాయని, కొన్ని సందర్భాల్లో టెలివిజన్ చర్చల్లో సమాచారానికి బదులు గందరగోళం సృష్టించడంతో ప్రజల్లో మీడియాపై విశ్వాసం దెబ్బతింటున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ (FPC) అధికారిక ప్రారంభోత్సవంలో రెండవ రోజు భారత మీడియా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలదా?” అనే శీర్షికతో ఓ చర్చా కార్యక్రమం జరిగింది. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం, లక్ష్యంగా చేసుకున్న పాత్రికేయులకు చట్టపరమైన రక్షణ కల్పించడం, సామాజిక భద్రతా పథకాలను అమలు చేయడం, నిధుల కొరతతో బాధపడుతున్న ప్రజా ప్రయోజన జర్నలిజం కోసం రిపోర్టింగ్ ఫెలోషిప్లను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలతో రూపొందించిన సమగ్ర జాతీయ మార్గసూచి అయిన హైదరాబాద్ డిక్లరేషన్ను చారిత్రాత్మకంగా ఆమోదించడంతో ఈ రెండు రోజుల కార్యక్రమం ముగిసింది.
సంచలనం, తప్పుడు సమాచార వ్యవస్థలు, సంపాదకీయ స్వాతంత్ర్యం లేకపోవడం వంటి వాటిపై పోరాడేందుకు ఒక మార్గాన్ని రూపొందించే అంశాలపై జరిగిన ఈ చర్చలకు మోడరేటర్, ఎన్డిటివి మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ నాయకత్వం వహించారు.
సభను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ది హిందూ గ్రూప్ డైరెక్టర్, ది హిందూ వార్తాపత్రిక మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ అయిన ఎన్ రామ్, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే, జర్నలిజం మూల సూత్రాలకు తిరిగి వెళ్లాల్సిన తక్షణ అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందులో గ్రౌండ్ రిపోర్టింగ్, పరిశోధన, వివరణాత్మక రచనలు ఉన్నాయి.
“పరిశోధనాత్మక జర్నలిజం అనేది ప్రింట్ జర్నలిజం ప్రత్యేకత. డేటా రిపోర్టింగ్, వివరణాత్మక నివేదికలు విశ్వసనీయతను బలోపేతం చేయగలవు,” అని రామ్ అన్నారు. ఉన్నత ప్రమాణాలను నిలబెట్టడానికి పార్లమెంటరీ మద్దతుగల ప్రవర్తనా నియమావళి, స్వతంత్ర చట్టబద్ధమైన స్వీయ-నియంత్రణ, అంబుడ్స్మెన్ల అవసరం ఉందని ఆయన అన్నారు. భవిష్యత్ తరాలు సమాచారాన్ని విమర్శనాత్మకంగా మూల్యాంకనం చేయగలిగేలా పాఠశాల పాఠ్యప్రణాళికలో మీడియా అక్షరాస్యతను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను కూడా రామ్ నొక్కి చెప్పారు.
వాస్తవాలను తనిఖీ చేసే కార్యక్రమమైన ఆల్ట్ న్యూస్ సహ-వ్యవస్థాపకుడు, ఎడిటర్ ప్రతీక్ సిన్హా, మీడియా పరిశ్రమ సమగ్రతను దెబ్బతీసే ఆర్థిక సమస్యల గురించి వివరించారు. పెద్ద టెక్ కంపెనీలు ఉపయోగించే కార్పొరేట్ ప్లాట్ఫారమ్లు, అల్గారిథమ్లకు దూరంగా ఉంటూ, పాఠకులతో పరస్పర సంభాషణకు వీలు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను అభివృద్ధి చేయాలని సిన్హా వార్తా సంస్థలను కోరారు.
ఓపెన్-సోర్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించడం, ప్రింట్ విశ్లేషణాత్మక జర్నలిజాన్ని వీడియోల ద్వారా డిజిటల్గా అందుబాటులోకి తీసుకురావడం వంటివి యువ ప్రేక్షకులను చేరుకోవడానికి సహాయపడతాయని సిన్హా వివరించారు. డిజిటల్ మీడియా, జర్నలిజం భవిష్యత్తుపై సియాసత్ డిజిటల్ డెస్క్ ఎడిటర్ సయ్యదా ఫైజా కిర్మానీ మాట్లాడుతూ… రియల్-టైమ్ కంటెంట్ను ధృవీకరించాల్సిన బాధ్యత డిజిటల్ న్యూస్రూమ్లపై ఉందని నొక్కి చెప్పారు. ఆన్లైన్ మీడియా వార్తలను వేగవంతం చేస్తున్నప్పటికీ, లోతైన జర్నలిజానికి సాంప్రదాయ ప్రింట్, ధృవీకరించిన డిజిటల్ రిపోర్టింగ్ మాత్రమే పునాది అని ఆమె అన్నారు.
జర్నలిజం భవిష్యత్తు అనేది న్యూస్రూమ్లు “త్వరిత క్లిక్ల” కంటే సమాచారం ధృవీకరణకు, లోతుకు ప్రాధాన్యత ఇవ్వడంపై, అలాగే డిజిటల్ ప్లాట్ఫారమ్లు ప్రాథమిక ప్రజా ప్రయోజన ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడటంపై ఆధారపడి ఉంటుందని కిర్మానీ అన్నారు.
మీడియా నిపుణుల హక్కులపై జరిగే చట్టపరమైన, ప్రభుత్వపరమైన దాడుల నుంచి వారిని రక్షించడానికి, నైతిక జర్నలిజాన్ని ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ ప్రెస్ క్లబ్ల నెట్వర్క్ను ఏర్పాటు చేయాలన్న ఫెడరేషన్ తీర్మానంతో ఈ సదస్సు ముగిసింది.


