న్యూఢిల్లీ: భారత విద్యా వ్యవస్థ యువత ఆశలను వమ్ము చేస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీక్లు, విపరీతంగా పెరుగుతున్న ఫీజులు, శిథిలావస్థకు చేరుతున్న మౌలిక వసతుల కారణంగా విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని ఆయన పేర్కొన్నారు.
భారత విద్యా వ్యవస్థ ఏ తరాన్ని అయితే ఉన్నత స్థాయికి తీసుకురావాలో అనుకుంటుందో, అదే తరాన్ని విఫలం చేస్తోంది. అయితే, ప్రతిరోజూ దాని వైఫల్యాలను అనుభవిస్తున్న వారి మాటలు వినడం వల్లే ఆ సమస్యను సరిద్దిదడం సాధ్యమవుతుంది. విద్యా వ్యవస్థపై ఎందుకు ఆశ కోల్పోయారని విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మీ అనుభవాలను ఒక ఆన్లైన్ వేదిక ద్వారా తనతో పంచుకోవాలని కూడా ఆయన వారిని కోరారు.
సెప్టెంబర్ 19న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగనున్న తన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ఐదవ ఎడిషన్కు ముందు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థలో అర్థవంతమైన మార్పులు తీసుకురావడానికి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మాట వినడం చాలా కీలకమని కాంగ్రెస్ అగ్రనేత చెబుతూ వస్తున్నారు.
ఇప్పటివరకు, రాహుల్ గాంధీ కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్రాజ్, పూణేలలో ‘ఛాత్రోన్ కీ గూంజ్’ నాలుగు ఎడిషన్లను నిర్వహించారు. ఆగస్టు 22న పూణేలో జరిగిన ఇటీవలి కార్యక్రమం బాలికా విద్యార్థులపై దృష్టి సారించింది.
ఈ కార్యక్రమం ద్వారా, పరీక్షలలో అవకతవకలు, విద్యా ఖర్చులు, మౌలిక సదుపాయాలు వంటి సమస్యలపై విద్యార్థులు లేవనెత్తిన ఆందోళనలను ప్రముఖంగా ప్రస్తావించడంతో పాటు, సంస్కరణల కోసం వారి అనుభవాలను మరియు సూచనలను పంచుకోవాలని రాహుల్ గాంధీ వారిని ఆహ్వానించారు.
