వాషింగ్టన్ : అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోని నలుగురు న్యాయమూర్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్ ఇవ్వడమేనని సమాచారం. తద్వారా హేగ్లోని కోర్టుపై చివరి ప్రయత్నంగా అమెరికా ఒత్తిడిని పెంచినట్లైంది. అంతేకాదు ఈ ఆంక్షలు ICC పనితీరును, ప్రత్యేకించి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులపై విచారణను ప్రభావితం చేస్తాయి.
ఈ నలుగురు న్యాయమూర్తులు మహిళలు కావడం గమనార్హం. ఆంక్షల కారణంగా వీరు యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించలేరు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోని వారి ఆస్తులను నిరోధించవచ్చ. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ… “ఐసిసి చట్టవిరుద్ధమైన చర్యలు.. మన సార్వభౌమత్వాన్ని, ఇజ్రాయెల్ను, ఏదైనా ఇతర US మిత్రదేశాన్ని రక్షించడానికి మేము అవసరమని భావించే ఏ చర్యలనైనా యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటుందని” ఒక ప్రకటనలో తెలిపారు.
కాగా, అమెరికా ఆంక్షలపై కోర్టు ఘాటుగా స్పందించింది. ఈ చర్యలు కోర్టు స్వతంత్ర, నిష్పాక్షికమైన, న్యాయపరమైన పనికి హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ప్రపంచంలోని 125 సభ్య దేశాల ఆదేశం ప్రకారం పనిచేసే అంతర్జాతీయ న్యాయ సంస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే స్పష్టమైన ప్రయత్నమని పేర్కొంది.”
స్లోవేనియాకు చెందిన బేటీ హోహ్లర్, బెనిన్కు చెందిన రీన్ అలాపిని-గన్సౌ అనే ఇద్దరు న్యాయమూర్తులు నవంబర్లో నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడానికి దారితీసిన విచారణలో పాల్గొన్నారు.
రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత… గాజాలో ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడింది. గాజాను శిధిల నగరంగా మార్చింది. లక్షలాదిమందిని నిరాశ్రయులను చేసింది. వైమానిక దాడులలో అమాయకులను పిల్లలను చంపేసింది. ఆస్పత్రులపై దాడి చేసి రోగుల మరణానికి కారణమైంది. మొత్తంగా పాలస్తీనియన్లను తుదముట్టించేందుకు, వారికి ఎలాంటి ఆహార పదార్థాలు అందకుండా ఆకలితో అల్లాడేలా గాజా దిగ్బంధనం చేసింది. దీంతో ఈ యుద్ధ నేరాలకు గాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ను బాధ్యులుగా గుర్తించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
మరోవంక పెరూకు చెందిన లుజ్ డెల్ కార్మెన్, ఉగాండాకు చెందిన సోలోమీ బలుంగి బోసా అనే ఇద్దరు న్యాయమూర్తులు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధ సమయంలో యుఎస్ దళాలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాయనే ఆరోపణలపై దర్యాప్తుకు దారితీసిన కోర్టు విచారణలో భాగంగా ఉన్నారు.
కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఆఫ్ఘనిస్తాన్ దర్యాప్తుపై అప్పటి ఐసిసి చీఫ్ ప్రాసిక్యూటర్పై ఇప్పటికే ఆంక్షలు విధించారు. 2020లో ట్రంప్ ఓటమి తర్వాత, అప్పటి అధ్యక్షుడు జో బిడెన్ సహకారంతో కోర్టుకు మరింత రాజీపడే విధానాన్ని అనుసరించారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియోకు ముందున్న యూఎస్ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ట్రంప్ ఆంక్షలను రద్దు చేశారు. ఇజ్రాయెల్ వైఖరిని విమర్శించినప్పటికీ, ఉక్రెయిన్పై రష్యా దాడిపై దర్యాప్తులో కోర్టుతో కలిసి పనిచేశారు.
యుద్ధ సమయంలో ఉక్రేనియన్ పిల్లలను సామూహికంగా అపహరించారనే ఆరోపణలపై 2023లో ఐసిసి న్యాయమూర్తులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.